పోలీసులు ఎంత కట్టడి చేస్తున్నా… ఎత్తుకు పైఎత్తు వేస్తున్నారు కేటుగాళ్లు. సరికొత్త మార్గాల్లో గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని తరలిస్తున్నారు. కారు డిక్కీల్లో… కారు టైర్లలో గంజాయిని రవాణా చేసే గ్యాంగులను చూశాం కానీ… కారు సీఎన్జీ గ్యాస్ సిలిండర్లలో గంజాయిని తరలించే ప్రయత్నం చేసిందో నయా గ్యాంగ్. పక్కా స్కెచ్ తో ముఠాని అరెస్ట్ చేశారు ఎస్వోటీ పోలీసులు.
ఎన్ని గ్యాంగులు పట్టుబడుతున్నా… ఎన్ని నెట్ వర్క్ లను చేధిస్తున్నా.. గంజాయి రవాణాకు మాత్రం బ్రేక్ పడటం లేదు. రోజుకో ముఠా… సరికొత్త మార్గాల్లో గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తోంది. తాజాగా మరో ముఠాను పట్టుకున్నారు మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు. సీఎన్జీ గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ ఉండాల్సింది పోయి గంజాయి పొట్లాలు బయటపడుతు న్నాయి. పెట్రోల్ కారే అయినా… పైకి సీఎస్జీ గ్యాస్ తో నడిచే కారులా కలరింగ్ ఇస్తూ… కారు డిక్కీలో సీఎన్జీ సిలిండర్ ను పెట్టారు కేటుగాళ్లు. పోలీసులు పట్టుకున్నా… సిలిండరే కదా అని చూసి వదిలేస్తారు అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. సీఎన్జీ సిలిండర్ లో 40 కిలోల గంజాయిని పొట్లాలుగా మార్చి పెట్టారు. కారు వెనక సీటు కింద మరో 25 కిలోల గంజాయిని పెట్టారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ మీదుగా ఆగ్రా తరలించేందుకు ప్రయత్నించారు కేటుగాళ్లు. పట్టుబడ్డ గంజాయి విలువ 19 లక్షల 50 వేలుగా ఉంటుందని తెలిపారు మేడ్చల్ డీసీపీ.
ఉత్తరప్రదేశ్ కి చెందిన అరవింద్ చౌదరి, అభిషేక్ తోమర్, ఆశిష్ కుశ్వంత్, ఆకాష్ సోలంకి అనే నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అరవింద్ చౌదరి.. ఓ మర్డర్ కేసులో అరెస్ట్ అయి జైలు శిక్ష అనుభవించాడని, జైలులో పరిచయమైన వ్యక్తుల ద్వారా.. గంజాయి వ్యాపారానికి తెరలేపాడని తెలిపారు డీసీపీ. నిందితుల నుంచి రెండు కార్లు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకు న్నారు. ఏపీలో ఎవరు ఈ గ్యాంగ్ కు డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో పట్టుబడ్డ ఇతర గ్యాంగు లతో లింకులు ఉన్నాయా అనే యాంగిల్ లో విచారిస్తున్నామన్నారు డీసీపీ.


