స్వతంత్ర వెబ్ డెస్క్: అఖిల భారత సర్వీసుల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఏడాది నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2023 పరీక్ష ఫలితాలు జూన్ 12న విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను upsc.gov.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఈ ఏడాది మే 28న సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు దాదాపు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. దేశవ్యాప్తంగా దాదాపు 6 లక్షల మంది హాజరయ్యారు. ఇందులో మొత్తం 14,624 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరు ఈ ఏడాది సెప్టెంబరు 15న జరిగే మెయిన్స్ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హత సాధించారు. అయితే వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి అందులో 600 మంది వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 71,128 మంది దరఖాస్తు చేయగా వారిలో సుమారు 45వేల మంది పరీక్ష రాశారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 200లకు కటాఫ్ మార్కులు 80 వరకు ఉండొచ్చని బ్రెయిన్ ట్రీ డైరెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. యూపీఎస్సీ మాత్రం కటాఫ్ మార్కులను అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. వచ్చే సెప్టెంబరు 15 నుంచి అయిదు రోజులపాటు మెయిన్స్ జరగనున్నాయి.
యూపీఎస్సీ 2023 లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష కోసం ఇప్పుడు మళ్లీ డిటైల్డ్ అప్లికేషన్ ఫామ్ – 1లో దరఖాస్తు చేసుకోవాలని యూపీఎస్పీ తెలిపింది. ఇందుకు చివరి తేదీని కమిషన్ త్వరలోనే వెల్లడించనుంది. ప్రిలిమ్స్ కటాఫ్, ఆన్సర్ కీని సివిల్స్ సర్వీసెస్ పరీక్ష మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత వెల్లడించనున్నారు. పూర్తి వివరాలను https://www.upsc.gov.in/ వెబ్సైట్లో చూడొచ్చు.