స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న మొసళ్లే ఓ వ్యక్తిని చంపేసిన ఘటన కాంబోడియా దేశంలో చోటుచేసుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 మొసళ్లు ఒకేసారి దాడిచేయండంతో నరకయాతన అనుభవించాడు. కాంబోడియాలోని సియెమ్ రీప్ ప్రాంతంలో సుమారు 75 ఏళ్ల వయసున్న వృద్ధుడు మొసళ్లను పెంచుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఓ మొసలి గుడ్లు పెట్టడంతో వాటిని తీసుకునేందుకు కర్ర సాయంతో ప్రయత్నించాడు.
అయితే ఆ మొసలి అతడి చేతిలోని కర్రను నోటితో గట్టిగా తాగడంతో ఎన్క్లోజర్లో పడిపోయాడు. దీంతో బోనులో ఉన్న మొసళ్లన్నీ ఒక్కసారిగా ఆయనపై దాడి చేసి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేశాయి. కాగా సియేమ్ రీప్ ప్రాంతం మొసళ్ల పెంపకానికి ప్రసిద్ధి చెందింది. మొసళ్ల గుడ్లు, చర్మం, మాంసం కోసం అక్కడి స్థానికులు వీటిని భారీ సంఖ్యలో పెంచుతుంటారు. ఈ క్రమంలోనే కొన్ని సార్లు ఇలాంటి దారుణ ఘటనలు జరుగుతూ ఉంటాయని స్థానిక పోలీసులు చెబుతున్నారు.