స్వతంత్ర వెబ్ డెస్క్: సెనెగల్ నుంచి స్పెయిన్ కి పయనమైన మూడు పడవలు అదృశ్యమయ్యాయి. ఈ మూడు పడవల్లో ప్రయాణిస్తున్న 300మంది ఆచూకీ దొరకడం లేదని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 15రోజుల క్రితం సెనెగల్ నుంచి స్పెయిన్లోని కానరీ ఐలండ్స్కు వెళ్తుండగా అట్లాంటిక్ మహా సముద్రంలో ఈ మూడు పడవలు అదృశ్యమయ్యాయి. ఒక బోటులో 200 మంది, మిగతా రెండు బోట్లలో ఒకదాంట్లో 65 మంది, మరో దాంట్లో 60 మంది ఉన్నట్టు వలసదారులకు సాయం చేసే ‘వాకింగ్ బోర్డర్స్’ సంస్థ తెలిపింది. అదృశ్యమైన వారు ఏమయ్యారో తెలియక వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
ఆఫ్రికా నుంచి కానరీ ఐలండ్స్కు వలసదారులు తరలిపోవడం ఇటీవలి కాలంలో సర్వసాధారణంగా మారింది. మరీ ముఖ్యంగా వేసవిలో ఇది మరింత ఎక్కువగా ఉంటోంది. గతేడాది 22 మంది చిన్నారులు సహా 559 మంది కానరీ ఐలండ్స్కు వెళ్లేందుకు ప్రయత్నించినట్టు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ వలసల సంస్థ (ఐవోఎం) తెలిపింది. ఇలా వెళ్తూ గతేడాది 1,784 మంది వలసదారులు మరణించినట్టు వాకింగ్ బోర్డర్స్ పేర్కొంది. గతేడాది కానరీ ఐలండ్స్కు 15,682 మంది చేరుకున్నారని, అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 30 శాతం తగ్గిందని స్పెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది.