గడిచిన పది సంవత్సరాల్లో దాదాపు 300 మంది రోగులను విషపు ఇంజక్షన్ ఇచ్చి హత్యచేశానని చెప్తున్న ఓ వ్యక్తి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తమిళనాడులో జరిగిన ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. వీడియోలో హత్యా వివరాలు తెలిపిన వ్యక్తిని పళ్లిపాలయం పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. నామక్కల్ జిల్లా పళ్లిపాలయానికి చెందిన మోహన్రాజ్ (34) అనే వ్యక్తి.. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఎప్పుడూ తిరిగేవాడు. శవాగారం వద్ద పని చేస్తున్నఓ వ్యక్తితో కలిసి అతడు చెప్పిన పనులన్ని చేస్తుండేవాడు. ఇందుకోసం డబ్బులు తీసుకునేవాడు. ఈ క్రమంలో ఈనెల18న హత్యలు చేసినట్లు మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో పెట్టాడు. అదికాస్తా క్షణాల్లోనే అందరు చూసే సరికి వైరల్గా మారింది. ఈ వీడియోలో వయోభారం, ఆరోగ్యం క్షీణించిన రోగులను.. వారి కుటుంబసభ్యులు, బంధువుల కోరిక మేరకు చంపేవాడినని.. ఇందుకోసం రూ. 500 తీసుకుంటున్నట్లు తెలిపాడు. అయితే రోగులను చంపేదుకు సూదితో విషపు మందు వేసి హత్య చేస్తున్నట్లు వెల్లడించాడు. ఇలా పదేళ్ల వ్యవధిలో ఇప్పటివరకు దాదాపు 300 మందినిహత్య చేసినట్టు మోహన్రాజ్ వెల్లడించాడు.
ఇలాంటి పని ఇక్కడ మాత్రమే కాకుండా… చెన్నై, బెంగళూరుకి కూడా వెళ్లానని మోహన్రాజ్ తెలిపాడు. రూ.5 వేలు ఇస్తే చాలు… రెండు నిమిషాలలో పని పూర్తి చేస్తానని అంటున్నాడు. వీడియో చూసిన ప్రతిఒక్కరు షాక్ కు గురై.. షేర్ చేయడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. దీంతో మోహన్రాజ్ను అదుపులోకి తీసుకున్నామని పళ్లిపాలయం పోలీసులు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా మోహన్రాజ్ ను విచారించామని తెలిపారు. తాను మద్యం మత్తులోనే అలా మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఇప్పటి వరకు 18 మంది నకిలీ వైద్యులతో పాటు మరో ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేసినట్లు వెల్లడించారు పోలీసులు.