CM KCR | తెలంగాణ పంచాయతీలకు కేంద్ర అవార్డులు రావడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యున్నతంగా మన గ్రామాలు ఉన్నాయని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని పచ్చదనం, పరిశుభ్రత, అభివృద్ధిలో అన్నిరాష్ట్రాలకంటే ముందే నిలిపామన్నారు. కేంద్రం ప్రకటించిన 46 ఉత్తమ అవార్డుల్లో 13 మన రాష్ట్రానికే దక్కడం గర్వకారణమని అన్నారు. స్వచ్ఛ గ్రామాల పోటీల్లో దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామ పంచాయతీలు అవార్డుల కోసం పోటీ పడ్డాయని అన్నారు. ఇందులో కేవలం 46 గ్రామాలకు మాత్రమే అవార్డులు వరించాయన్నారు.
అంతేకాకుండా దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాల్లో 9 విభాగాలకు గాను తెలంగాణ 8 విభాగాల్లో అవార్డులు సాధించడం అత్యంత సంతోషనీయమన్నారు. మొత్తం జాతీయ అవార్డుల్లో 30 శాతం తెలంగాణనే సాధించడం మనందరికీ గర్వకారణం అన్నారు. 13 ర్యాంకుల్లోనూ నాలుగు మొదటి 4 ర్యాంకులు రావడమనేది యావత్తు తెలంగాణకు సంతోషాన్నిస్తుందని అన్నారు. సుదీర్ఘ కాలంగా అనేక కష్టాలను ఎదుర్కొని, వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ.. నేడు పరిశుభమైన గ్రామాలను అభివృద్ధి చేసుకున్నామని అన్నారు. రాష్ట్రం అభివృద్ధిలో, ప్రగతిలో దూసుకుపోతుంతే ఓర్వలేకే ప్రతిపక్షాలు వితండవాదం చేస్తున్నాయని మండిపడ్డారు.