APCC అధ్యక్షురాలు షర్మిలతో మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇడుపులపాయలో భేటీ అయ్యారు. దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆమె కాంగ్రెస్లో చేరతారన్న ప్రచారం దృష్ట్యా ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేప ట్టిన అనంతరం సునీత ఆమెను కలవడం ఇదే తొలిసారి. సమావేశానంతరం వారిద్దరూ కలిసి వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించారు.
ఈ భేటీలో సునీత రాజకీయ ప్రవేశంపై చర్చ జరిగినట్లు సమాచారం. తన తండ్రి హత్యపై సునీత తొలి నుంచి గట్టి పోరాటమే చేస్తున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి సీబీఐ విచారణ కోరడం.. ఆ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి రావడం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు అరెస్టు కూడా అయ్యారు. కడప ఎంపీ అవినాష్రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. భాస్కరరెడ్డితో పాటు ఇతరులు చంచ ల్గూడ జైలులో రిమాండు ఖైదీలుగా ఉండగా.. అవినాష్రెడ్డి బెయిల్ తెచ్చుకున్నారు. దీనిపై సునీత సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు. ఇది చేస్తూనే తన తండ్రిని హత్య చేసిన వ్యక్తులను రాజకీయంగా ఎదుర్కోవాలని సునీత భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇడుపులపాయ ఎస్టేట్కు వచ్చిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా షర్మిలతో భేటీ అయ్యారు.