శివసేన నేత ఫేస్బుక్ లైవ్లో మాట్లాడుతుండగా దారుణ హత్యకు గురయ్యారు. అనంతరం నిందితుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ముంబయిలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉంటున్న సామాజిక కార్యకర్త మౌరిస్ నోరాన్హ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
శివసేన యూబీటీ వర్గానికి చెందిన అభిషేక్ ఘోసాల్కర్ గతంలో కార్పొరేటర్గా పనిచేశారు. అతడి తండ్రి వినోద్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. స్థానిక ఉద్యమకారుడైన నోరాన్హ, అభిషేక్ల మధ్య కొంతకాలంగా వ్యక్తిగతవైరం ఉంది. ఈ క్రమంలో ముంబయిలోని బొరివిల్లీ ప్రాంతంలోని ఐసీ కాలనీ అభివృద్ధి పనుల కోసం మాట్లాడుకోవడానికి నోరాన్హ తన కార్యాలయానికి అభిషేక్ను ఆహ్వానించాడు. అక్కడికి వెళ్లిన అభిషేక్ ఫేస్బుక్ లైవ్లో మాట్లాడుతుండగా నిందితుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. పొట్టలో, భుజంలోకి తూటాలు దూసుకెళ్లడంతో బాధితుడు కుప్పకూలాడు. గమనించిన స్థానికులు అభిషేక్ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనంతరం నోరాన్హ తనని తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాల్పుల ఘటన అంతా ఫేస్బుక్ లైవ్లో రికార్డు అయింది.
ఈ ఘటనపై సీఎం ఏక్నాథ్ శిండే విచారణకు ఆదేశించగా, ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో శాంతి భద్రతలు కరవయ్యాయని మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే విమర్శించారు. ఇటువంటి ఘటనే ఇటీవల మహారాష్ట్రలో చోటుచేసుకుంది. శివసేన నేతపై పోలీస్ కార్యాలయంలోనే బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు జరపడం చర్చనీయాంశమైంది.


