యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ హాస్టల్లో విద్యార్థినుల ఆత్మహత్య ఘటనలో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ పిల్లల మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గొడవ కారణంగా మనస్థాపానికి గురైన ఇద్దరు బాలికలు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన సంచలనం రేపింది. అంతేకాదు చనిపోయేముందు వారిద్దరూ కలిసి రాసిన లెటర్ లో చావుకు కారణాలు కూడా వివరించారు. ఈ ఘటన హాస్టల్ విద్యార్థుల తల్లి దండ్రులను కలవరానికి గురిచేస్తోంది.
హైదరాబాద్లోని హబ్సిగూడకు చెందిన బాలికలు భువనగిరిలోని ఎస్సీ వసతిగృహంలో ఉంటూ పట్టణంలోని రెడ్డివాడ బాలికోన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్నారు. అయితే రోజూలాగే శనివారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థినులు తిరిగి వచ్చారు. కానీ సాయంత్రం ట్యూషన్కు హాజరుకాలేదు. దీంతో ట్యూషన్ టీచర్ పిలవగా.. తాము రాత్రి భోజనం చేశాక వస్తామని చెప్పి గదిలోనే ఉండిపోయారు. భోజన సమయంలో కూడా వారు రాకపోవడంతో ఓ విద్యార్థిని గది వద్దకు వెళ్లి చూడగా.. అప్పటికే ఇద్దరు విద్యార్థినులు రెండు ఫ్యాన్లకు ఉరేసుకున్నట్లు టీచర్లకు సమాచారం అందించింది. వెంటనే అంబులెన్స్ను రప్పించి వారిద్దరినీ జిల్లా కేంద్రంలోని దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. విద్యార్థినులను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు.ఆ బాలికల దగ్గర లభించిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాము వెళ్లిపోతున్నందుకు అందరూ క్షమించమని వేడుకున్నారు. తాము తప్పు చేయకపోయినా అందరూ తమనే అంటుంటే ఆ మాటలు తీసుకోలేకపోతున్నామని లెటర్లో రాశారు. శైలజ మేడం తప్ప ఎవరూ నమ్మలేదని… తమ బాధ ఎవరికీ చెప్పుకోలేక వెళ్లిపోతున్నామన్నారు. ఇద్దరినీ ఒకచోటే సమాధి చేయండి అంటూ ఆవేదన చెందినట్లు పోలీసులు తెలిపారు.


