అద్వానీ రాజకీయ ప్రస్థానంలో రథయాత్ర ఒక కీలకఘట్టం. రథయాత్రతో భారతీయ జనతా పార్టీని దేశం నలువైపు లా విస్తరింపచేశారు. ఈశాన్య రాష్ట్రాల్లోనూ కమలం జెండా ఎగరేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. అయోధ్య లో రామమందిర నిర్మాణానికి పునాది వేసింది అద్వానీయే.
అయోధ్యా నగరం, శ్రీరామచంద్రుడి జన్మస్థలం. సాక్షాత్తూ విష్ణువు రూపమైన రామచంద్రులవారు జన్మించిన ప్రాంత మే అయోధ్య. ఈ కారణంతోనే కులమతాలకతీతంగా అయోధ్య పరమ పవిత్ర నగరమైంది. ఇంతటి పవిత్రతగల అయోధ్యానగరంలో రామమందిరం నిర్మించాలన్నది భారతీయుల శతాబ్దాల కల. అయోధ్యలో రామమందిరం నిర్మించాలని 90వ దశకంలో భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా 1990లో గుజరాత్లోని సోమ్నాధ్ నుంచి అయోధ్య వరకు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ రథయాత్ర చేశారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ రథయాత్ర కొనసాగింది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అనుగుణం గా దేశ ప్రజలందరిని మద్దతు కూడగట్టడమే అద్వానీ రథయాత్ర ప్రధాన లక్ష్యం. అలా …అయోధ్యలో రామమందిర నిర్మాణానికి తొలి మెట్టుగా అద్వానీ రథయాత్రను పేర్కొంటారు చరిత్రకారులు.
1947 తరువాత భారతదేశ చరిత్రలో ప్రజలందరూ పాల్గొన్న అతి పెద్ద ఉద్యమం ఏదైనా ఉందా అంటే…ఠక్కున గుర్తుకు వచ్చేంది రామమందిర నిర్మాణ ఉద్యమమే. అయోధ్యలో రామచంద్రులవారి ఆలయం నిర్మించాలన్నది ఐదు వందల సంవత్సరాల నుంచి యావత్ భారతీయుల ఆశయం. ఈ ఆశయ సాధనకు నాంది పలికింది లాల్ కృష్ణ అద్వానీ రథయాత్ర. 1990 సెప్టెంబర్ 25న సోమ్నాథ్ నుంచి అయోధ్య వరకు అద్వానీ రథయాత్ర ప్రారంభమైంది. రామమందిర నిర్మాణానికి పునాది వేసిన అద్వానీ రథయాత్రను సెప్టెంబర్ 25న ప్రారంభించడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. సెప్టెంబర్ 25 దీన్ దయాళ్ జయంతి. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ రథయాత్ర ప్రారంభించారు లాల్ కృష్ణ అద్వానీ. మొత్తం పది వేల కిలోమీటర్ల మేర రథయాత్ర చేసి చివరకు అక్టోబరు 30న అయోధ్య చేరాలన్నది అప్పట్లో అద్వానీ ఆలోచన. అయోధ్యలో రామమందిర నిర్మాణం అనేది మతప రమైన అంశం కాదంటారు లాల్ కృష్ణ అద్వానీ. రామమందిర నిర్మాణంతో జాతీయ భావన ముడిపడి ఉందంటారు అద్వానీ. 1990 నాటి అద్వానీ రథయాత్ర ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యఘట్టం. ఈ కీలక ఘట్టానికి నాయ కత్వం వహించినందుకు తాను ఎంతో సంతోషిస్తున్నానన్నారు లాల్ కృష్ణ అద్వానీ. ఉన్నత విలువలతో కూడిన జీవితం గడపాలన్న భారతీయుల ఆకాంక్షలకు రామచంద్రులవారు ఒక ఆదర్శం అంటారు అద్వానీ. ఆ విధంగా రామచంద్రు లవారు సమస్త భారతీయులకు ఒక రోల్ మోడల్గా నిలిచారన్నారు. అద్వానీ రథయాత్రకు సంబంధించి ఒక విశేషం ఉంది. 1990నాటి అద్వానీ రథయాత్రలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాల్గొన్నారు. నరేంద్రుడి రాజకీయ జీవితం, అద్వానీ రథయాత్రతో ముడిపడి ఉండటం చెప్పుకోదగ్గ విశేషం. వాస్తవానికి అద్వానీ యాత్ర చేసిన రథం ఒక మినీ ట్రక్కు. యాత్ర కోసం ఈ మినీ ట్రక్కును రథంగా రీడిజైన్ చేశారు. రథయాత్ర సందర్భంగా రాత్రిళ్లు మితాహారంతో పాటు ఒక గ్లాసు పాలు తీసుకునే వారు అద్వానీ. వాహనంపై ప్రత్యేకంగా రూపొందించిన ప్లాట్ఫామ్ పై నుంచుని ప్రజలనుద్దేశించి అద్వానీ ప్రసంగించేవారు.
రథయాత్ర సందర్భంగా అద్వానీ చేసిన ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకునేలా ఉండేవి. ప్రసంగం అంటే గంటలు గంటలు ఉండేవి కావు. చాలా క్లుప్తంగా ఉండేవి. ఎక్కడైనా సరే ఐదు నిమిషాలు మించకుండా అద్వానీ ప్రసంగించేవారు. ప్రధానంగా అయోధ్యలో రామమందిర నిర్మాణం ఆవశ్యకత చుట్టూనే అద్వానీ ప్రసంగాలు ఉండేవి. అంతకుమించి సాధారణ రాజకీయాలను అద్వానీ తన ప్రసంగాల్లో ఎక్కడా ప్రస్తావించేవారు కాదు. అంతేకాదు, అయోధ్య అంశంపై హిందువుల మనోభావాలను గౌరవించాలని ముస్లిం సంఘాల నేతలను ఆయన కోరేవారు. అయోధ్య రాముడు, హిందూ మతానికి పరిమితం కాదన్నారు. యావత్ భారతీయ సమాజానికి రామచంద్రులవారు ఒక ఆదర్శం అనేవారు లాల్ కృష్ణ అద్వానీ. రథయాత్ర ప్రవేశించిన ప్రతి చోటా ప్రజలు అద్వానీకి ఘన స్వాగతం పలికారు. అద్వానీకి స్వాగతం పలుకుతూ ఆయా నగరాల్లో తోరణాలు ఏర్పాటు చేశారు. ఎక్కడకు వెళ్లినా అద్వానీపై డాబాల పై నుంచి పూలవర్షం కురిపించారు స్థానిక ప్రజలు. అద్వానీ రథయాత్రకు కులమతాలకతీతంగా మద్దతు లభించింది. యావత్ భారతదేశం అద్వానీ వెంట నడిచింది. అయోధ్యరాముడి మందిర నిర్మాణ ప్రతిపాదనకు ప్రజలు జై కొట్టారు. రామచంద్రులవారు కేవలం హిందువులకే కాదనీ, యావత్ భారతీయులకు పూజనీయుడని రథయాత్ర తేల్చి చెప్పింది. అలనాటి రథయాత్ర అనుభవాలను అద్వానీ తన ఆత్మకథ మై క్రంట్రీ – మై లైఫ్ లో పూసగుచ్చినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో అయోధ్యలోని మందిరం భారతీయులందరికీ రామచంద్రులవారి సద్గుణాలను అలవర్చుకునే స్ఫూర్తి అందిస్తుందని భావిద్దాం.


