అయోధ్య రామమందిర అంశంతో సామాన్య జనంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్ ఆమాంతం పెరిగింది. అయోధ్యలో రాములవారికి ఆలయం కట్టాలన్న హిందువుల కల నరేంద్ర మోడీ హయాంలో సాకారమైందని దేశ ప్రజలు అనుకుంటున్నారు. అటు రామమందిరం ఇటు నరేంద్రుడి వ్యక్తిగత ఇమేజ్ లోక్సభ ఎన్నికల్లో తమకు ప్లస్ పాయిం ట్లుగా మారుతాయని కమలనాథులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఉమ్మడి పౌర స్మృతి అలాగే పౌరసత్వ సవరణ బిల్లు కూడా కమలం పార్టీకి ఆయుధాలుగా మారుతున్నాయి.
ప్రస్తుత జాతీయ రాజకీయాల్లో జనాకర్షణ విషయంలో ఇప్పటికీ నెంబర్ వన్ ప్రధాని నరేంద్ర మోడీయే. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అందరూ జనాకర్షణ అంశంలో ప్రధాని నరేంద్ర మోడీ తరువాతే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఛరిష్మాకు అయోధ్య రామమందిర అంశం తోడయింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం అనే డిమాండ్ దాదాపు ఐదు వందల ఏళ్ల నాటిది. ఐదు శతాబ్దాల నుంచి అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు. రాముడి జన్మస్థలమైన అయోధ్యలో శ్రీరాముడికి ఒక మందిరం నిర్మించాలన్నది భారతీయుల కల. చాలా కాలం పాటు ఆ కల , కలగానే మిగిలింది. చివరకు నరేంద్ర మోడీ హయాంలో శతాబ్దాల కల సాకారమైంది. మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు నుంచి సానుకూలంగా తీర్పు రావడంతో మార్గం సుగమమైంది. రామమందిర నిర్మాణానికి 2020 ఆగస్టు ఐదో తేదీన ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ చేశారు. శంకుస్థాపన చేసిన నాలుగేళ్ల లోపే బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన చేసి నరేంద్రుడు రికార్డు సృష్టించారు. దీంతో ఒక్కసారిగా ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్ ఆకాశాన్ని తాకింది.
ఇదిలా ఉంటే లోక్సభ ఎన్నికల్లో రామమందిర అంశం లోక్సభ ఎన్నికల్లో కీలకం కాబోతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ జనాకర్షణ కూడా లోక్సభ ఎన్నికల్లో తమకు ప్లస్ పాయింట్గా మారుతుందని బీజేపీ వర్గాలు బోలెడు ఆశలు పెట్టుకున్నాయి. ఒకవైపు అయోధ్య రామాలయం మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ జనాకర్షణ తమకు కలిసి వస్తుందని కమలం పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఉమ్మడి పౌరస్మృతి …ఇదొక వివాదాస్పద అంశం. భారతీయ జనతా పార్టీ అమ్ములపొదిలో ఉన్న మరో అస్త్రం. తాజాగా ఈ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ దిశగా ఉత్తరాఖండ్ అడుగులు వేసింది. చివరకు ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదించింది. వాస్తవానికి ఉమ్మడి పౌరస్మృతి కొత్త అంశం కాదు. సివిల్ అంశాలకు సంబంధించి అన్ని మతాలవారిని ఒకే చట్టం కిందకు తీసుకురావాలన్నది కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది.
అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కూడా బీజేపీ అజెండాలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. అయితే అప్పటికి బీజేపీ మిత్రపక్షాలమీద ఆధారపడి సంకీర్ణ ప్రభుత్వాలను నడుపుతోంది. దీంతో పార్లమెంటులో తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో యూనిఫామ్ సివిల్ కోడ్ అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టింది భారతీయ జనతా పార్టీ. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి పార్లమెంటులో తగినంత సంఖ్యాబాలం ఉంది. ఏ మిత్రపక్షం మీదా ఆధారపడాల్సిన అవసరం కూడా కమలం పార్టీకి లేదు. దీంతో అమ్ముల పొది నుంచి ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని భారతీయ జనతా పార్టీ బయటకు తీసింది.
మనదేశంలోని ప్రజలందరికీ నేరాలకు సంబంధించి విచారించడానికి ఒక చట్టం ఉంది. అదే ఇండియన్ పీనల్ కోడ్. హిందువు, ముస్లిం, క్రిస్టియన్ , పార్సీ, జైన్, బుద్ధిస్ట్ …ఇలా మతాలతో సంబంధం లేకుండా ఎవరు నేరం చేసినా ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం వారిని విచారిస్తారు. నేరం రుజువైతే శిక్ష విధిస్తారు. అయితే వివాహం, విడాకులు, దత్తత, వారసత్వ హక్కులు ఇలాంటి సివిల్ అంశాలకు సంబంధించి వేర్వేరు చట్టాలున్నాయి. ఇలాంటి వ్యక్తిగత అంశాలకు సంబంధించి ముస్లింలు తమ ధర్మశాస్త్రమైన షరియాను అనుసరిస్తుంటారు. షరియాకు లోబడే అన్ని సివిల్ వివాదాలను పరిష్కరించుకుంటారు. ఇది, ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతున్న వ్యవస్థే. ఇదిలాఉంటే, సివిల్ అంశాలకు సంబంధించి కూడా అన్ని మతాలవారిని ఒకే చట్టం కిందకు తీసుకురావాలన్నది కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ గేమ్ ప్లాన్లాగా కనిపిస్తోంది.
పౌరసత్వ సవరణ బిల్లు…బీజేపీ అమ్ములపొదిలో ఉన్న మరో ఆయుధం. పౌరసత్వ సవరణ చట్టం మరో వారం లోగోఆ దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకువస్తామని కేంద్ర మంత్రి శాంతను ఠాకుర్ ఇటీవల పార్లమెంటు సాక్షిగా వెల్లడిం చారు. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే లోక్సభ ఎన్నికల్లో పౌరసత్వ సవరణ బిల్లు మరో కీలకాంశం అవుతుం దని రాజకీయ పరిశీలకులు పేర్కొన్నారు. భారత్కు పొరుగున ఉన్న పాకిస్థాన్, అప్ఘానిస్థాన్, బంగ్లాదేశ్.. మూడూ ఇస్లా మిక్ దేశాలు. ఈ మూడు దేశాల్లో హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, బౌద్ధులు, జైనులు, పార్శీలు మతహింసకు గురై నట్లు చరిత్రకారులు చెబుతారు. దీంతో వీరిలో చాలా మంది పొరుగున ఉన్న భారతదేశానికి శరణార్థులుగా వచ్చారు. అలాంటి వారికి భారత పౌరసత్వం కల్పించడం కోసం ఈ చట్టాన్ని రూపొందించారు. 2014 డిసెంబర్ 31లోగా భారత్ లోకి శరణార్థులుగా వచ్చిన వారికి మాత్రమే భారత పౌరసత్వం లభిస్తుంది. గతంలో భారత్లో 11 ఏళ్లుగా శరణార్థులుగా నివాసం ఉంటున్న వారికే భారత పౌరసత్వం ఇవ్వగా.. ఇప్పుడు దాన్ని ఐదేళ్లకు తగ్గించారు. పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి. బిల్లును పార్లమెంటు ఆమోదించిన మరునాడే రాష్ట్రపతి సంతకం చేశారు. దీంతో బిల్లు కాస్తా చట్టంగా మారింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంలో సవాల్ చేస్తామని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.అయితే పౌరసత్వం ఇచ్చే విషయంలో ముస్లింలను మినహాయించారు. దీంతో పౌరసత్వానికి, మతానికి ముడిపెట్టారని కేంద్రంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.