పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. పెద్దపల్లి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత కాంగ్రెస్లో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేసీ వేణుగోపాల్ ఇంటికి ఎంపీ వెంకటేష్ వెళ్లారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. వెంకటేష్ను పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతం పలికారు. ఉమ్మడి మహబూబ్నగర్కు చెందిన పలువురు భారాస నేతలు కూడా కాంగ్రెస్లో చేరారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతు న్నాయి. ప్రతిపక్ష పార్టీల నేతలు కాంగ్రెస్లో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ప్రస్తుత బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్లో చేరిపోయారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన వెంకటేష్ నేత.. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. తాజాగా బీఆర్ఎస్కు గుడ్బై చెప్పి మళ్లీ హస్తం గూటికి చేరారు. ఇక, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్టు సమాచారం.


