వైసీపీ నాలుగో జాబితాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసిన వైసీపీ .. పలువురు సిట్టింగులకు సైతం షాకిచ్చింది. సామాజిక సమీకరణలు, సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలంటూ పలు చోట్ల కీలక మార్పులు చేసింది. కొన్ని చోట్ల వారు ప్రాతినిథ్యం వహిస్తోన్న చోటు నుంచి కాకుండా వేరే చోటు నుంచి బరిలోకి దింపాలని నిర్ణయించింది. గత ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసిన వారికి ఈసారి ఎమ్మెల్యేలుగా పోటీ చేసేలా ఆదేశాలిచ్చింది. పలువురు మంత్రులు సైతం ఈ జాబితాలో ఉన్నారు. తొలి జాబితాలో 11 నియోజకవర్గాలకు ఇంఛార్జీలను మార్చగా, రెండో జాబితాలో 27 మంది పేర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. 21 మందితో మూడో జాబితాను విడుదల చేయగా.. ఇప్పుడు నాలుగో జాబితాపై టెన్షన్ నెలకొంది. అయితే, సంక్రాంతి దృష్ట్యా ఈ జాబితా ప్రకటన వాయిదా పడింది. ఇవాళ నాలుగో జాబితా విడుదల చేసే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే రిలీజ్ చేసిన జాబితాల్లో తమకు స్థానం దక్కకపోవడంతో కొందరు కీలక నేతలు పార్టీ అధిష్టానంపై అసం తృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఇంత కష్టపడ్డా సర్వేల పేరుతో తమకు సీటు నిరాకరించారంటూ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. పెనుమలూరులో పార్థసారధి తన స్థానాన్ని మంత్రి జోగి రమేశ్ కు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఈ నెల 21న టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే కోవలో రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సైతం ఉన్నారు. అలాగే, కాకినాడకు చెందిన ఎమ్మెల్యే పెండెం దొరబాబు సైతం తన సీటును వంగాగీతకు కేటాయించడంతో అక్కడ బల నిరూపణకు సిద్ధమయ్యారు. ఏలూరుకి సంబంధించి ఎలీజా సైతం పార్టీ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో పొమ్మనలేక పొగ పెడుతున్నారని మండిపడ్డారు. అయితే, పార్టీలో నేతలందరికీ సముచిత స్థానం ఉంటుందని, ఎవరూ తొందరపడవద్దని అధిష్టానం, కీలక నేతలు బుజ్జగిస్తున్నా కొందరు పట్టించుకోవడం లేదు. తమ కష్టానికి ప్రతిఫలం లేదంటూ చాలా మంది తమ దారి తాము చూసుకుం టున్నారు. ఈ క్రమంలో నాలుగో జాబితాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


