ధరణికి గిరి భారమా, గిరికి ధరణి భారమా…ఎవరికి ఎవరు భారం అంటూ ఓ కవి గేయం రాశారు. అయితే, భూమాత, పర్వతశ్రేణులకు సంబంధించిన ఆ పాటలో భారం మాట ఎలావున్నా.. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఇది ప్రజలకు భారమనే తెలియజేస్తోంది.
గత ప్రభుత్వ అవినీతి బాగోతానికి ధరణి నిదర్శనం అంటోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదో గొప్ప పథకం అని ఆర్భాటంగా తెలియజేయగా, ఇప్పటి కాంగ్రెస్ సర్కారు ఇది తప్పుల తడక అని తేల్చిపారేసింది. అంతేనా…ధరణీ భూ సమస్యల పరిష్కారానికి నడుం బిగించింది. ఇందుకు సంబంధించి ఓ కమిటీని ఏర్పాటు చేసింది. వెంటనే ఈ కమిటీ రంగంలోకి దిగి విధివిధానాలు రూపొందించే పనిలో నిమగ్నమైంది.
ధరణి పై రాష్ట్ర సర్కారు దృష్టి సారించింది. ఇటీవల ఏర్పాటు చేసిన ధరణి సమస్యల పరిష్కార కమిటీ సెక్రటే రియట్ లో తొలి సమావేశం నిర్వహించింది. ధరణిలో 119 సమస్యలు వున్నట్టు కమిటీ లెక్కలు కట్టింది. ఈ సమస్యల పరిష్కారానికి మార్గాలు అన్వేషిస్తోంది. ధరణికి పటిష్టమైన సాఫ్ట్ వేర్ అవసరమని నిర్దారణకు వచ్చింది. ఆర్వోఆర్ యాక్ట్ వున్నా స్పష్టమైన గైడ్ లైన్స్ లేకపోవడంతో సమస్యలు వస్తున్నాయని కమిటీ గుర్తించింది. భూ సమస్యల పరిష్కారానికి అధికార వికేంద్రీకరణ అవసరమని కమిటీ అభిప్రాయపడింది. ఈ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర, జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్టు ధరణీ సభ్యులు తెలిపారు.
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల పోర్టల్ ధరణికి సంబంధించి రెవెన్యూశాఖ సమగ్ర నివేదికను కమిటీ రూపొందిస్తోంది. 2020 నవంబరు 2 నుంచి ప్రారంభమైన ఈ పోర్టల్లోనే సాగు భూముల లావాదేవీలు కొనసాగు తున్నాయి. ధరణి వెలుపల ఉన్న భూములకు హక్కులు లేవు. హక్కుల కల్పనకు 34 మాడ్యూళ్లను ఏర్పాటు చేసినా సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయి. ఈ క్రమంలో గత నెల 13 న సీఎం రేవంత్రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధరణిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోర్టల్లో జరిగిన లావాదేవీలపై సమగ్ర సమాచారాన్ని అందించాలని రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారు. రాత్రిపూట జరిగిన లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్నిసైతం ఇవ్వాలని కోరారు. దీంతో రిజిస్ట్రేషన్లు- మ్యుటేషన్ల వివరాలను రెవె న్యూశాఖ సిద్ధం చేస్తోంది. వివాదాస్పద జాబితా అయిన 22ఎలో నమోదైన భూములను జాబితా నుంచి తొలగించి హక్కులు కల్పించిన అంశంపై సైతం ప్రభుత్వం వివరాలు కోరడంతో దీనిపైనా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ధరణి లో దాదాపు 68 లక్షల వ్యవసాయ ఖాతాలున్నాయి. పోర్టల్ నిర్వహణను ఒక ప్రైవేటు సంస్థ నిర్వహిస్తోంది. గత సెప్టెం బరులోనే నిర్వహణ గడువు ముగియగా.. అదే సంస్థను కొనసాగిస్తూ వస్తున్నారు. దీనిపై కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసు కోవాల్సి ఉంది.
ధరణి పోర్టల్ ఏర్పాటు తరువాత లావాదేవీలు, కొత్తగా హక్కుల కల్పనకు సంబంధించి అనేక సమస్యలు తలెత్తాయి. వీటిలో ఎక్కువగా సాంకేతికపరమైనవే ఉన్నాయి. గత ప్రభుత్వం హయాంలో అప్పటి ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్రావు నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. సమస్యల పరిష్కారానికి ఈ ఉపసంఘం పలు సిఫారసులు చేసినా అవి పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఈ కారణంగా సీఎం రేవంత్ రెడ్డి తాజా సమీక్షలో ధరణి నిర్వహణ, సాంకే తిక అంశాలకు సంబంధించి పలు అంశాలను ప్రస్తావించారు. దీంతో రెవెన్యూశాఖ పలువురు నిపుణులతో సాంకేతిక సమస్యలపై నివేదిక సిద్ధం చేస్తోంది.


