ఆటో పార్కింగ్ ఏర్పాటు చేసుకోమని స్థలం కేటాయించిన మున్సిపల్ అధికారులే తమ పొట్ట కొట్టేలా ప్రవర్తిస్తున్నారని మేడ్చల్ జిల్లా ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గుండ్లపోచంపల్లిలో గత 30 ఏళ్ల నుండి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న తమకు సరైన పార్కింగ్ స్థలం లేదని, ఈ విషయంలో మున్సిపల్ కమిషనర్ ను కోరగా నారాయణ చెరువు కట్టపై ఉన్న ఖాళీ స్థలంలో ఆటో స్టాండ్ ఏర్పాటు చేసుకోమని చెప్పారన్నారు. మున్సిపల్ సిబ్బంది అదే రోజు ఉదయం ఆటో యూనియన్ ఏర్పాటు చేసిన గుడిసెను తొలగించారని ఆరోపించారు. దీనికి నిరసనగా ఆటో డ్రైవర్లు ధర్నా చేపట్టారు. వీరికి మేడ్చల్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, కౌన్సిలర్ అమరం హేమంత్ రెడ్డి లు సంఘీభావం తెలిపారు.