అమరావతి ఇన్నర్ రింగ్రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, మరికొందరిపై విజయవాడ ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. సీఐడీ దాఖలుచేసిన అభియోగపత్రంలో నిందితులుగా చంద్రబాబు, అప్పటి పురపాలకశాఖ మంత్రి నారాయణ, హెరిటేజ్ ఫుడ్స్కు డైరెక్టర్గా వ్యవహరించిన నారా లోకేశ్, వ్యాపారవేత్త లింగమనేని రమేశ్, ఆయన సోదరుడు రాజశేఖర్లను ప్రధాన నిందితులుగా ఛార్జిషీట్లో పేర్కొన్నారు.
చంద్రబాబు, నారాయణ ఏపీ సీఆర్డీఏకి ఎక్స్అఫీషియో ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా వ్యవహరిస్తూ సింగపూర్ ప్రభుత్వానికి, ఏపీకి మధ్య అవగాహన ఒప్పందం జరిగిందని మంత్రిమండలికి, ప్రభుత్వానికి తప్పుగా చూపారని చార్జ్షీట్లో సీఐడీ తెలిపింది. అలాంటి ఒప్పందం జరగలేదన్నారు. కేంద్రం నుంచి ఆ ఒప్పందానికి అనుమతి తీసుకోలేదని… నామినేషన్ ప్రాతిపదికన విదేశీ మాస్టర్ప్లానర్ సుర్బానా జురాంగ్ను అక్రమ మార్గంలో నియమించారని పొందుపరిచారు. చట్టవిరుద్ధంగా రుసుము రూపంలో ఆ సంస్థకు కోట్ల రూపాయలు చెల్లించారన్నారు. రింగ్రోడ్డు, స్టార్టప్ ఏరియా మాస్టర్ప్లాన్ను నిందితులకు అనుకూలంగా, తమకు చెందిన సమీప భూములకు దగ్గరగా రూపొందించుకున్నారన్నారు. మాజీమంత్రి నారాయణ సొమ్ము పెట్టుబడిగా పెట్టి బంధువుల పేరున 58 ఎకరాలు కొన్నారని వెల్లడించారు. సీడ్ క్యాపిటల్ ఏరియాను ఈ భూములకు సమీపంలో డిజైన్ చేశారన్నారు. క్యాపిటల్ సిటీ ఏరియాలోని ఇతర ప్రాంతాల కంటే ముందుగా ప్రజాధనం 5 వేల 500 కోట్లతో సీడ్ క్యాపిటల్ ఏరియాను అభివృద్ధి చేస్తామని కమిట్మెంట్ ఇచ్చారని సీఐడీ చార్జ్షీట్లో పొందుపరిచింది. తమ భూముల విలువ పెరిగేలా చేసినందుకు క్విడ్ ప్రోకోలో భాగంగా వ్యాపారవేత్త లింగమనేని రమేశ్.. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులకు అద్దె లేకుండా ఇంటిని బహుమతిగా ఇచ్చారని చెప్పారు. ఇన్నర్ రింగ్రోడ్డు డిజైన్ చేసిన స్థలానికి పక్కనే హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ 14 ఎకరాలు కొనుగోలు చేసిందని చార్జ్షీట్లో సీఐడీ పేర్కొంది. ఈ ఛార్జిషీట్ను సీల్డ్కవర్లో ఏసీబీ కోర్టుకు అందజేశారు.


