సౌరమానం ప్రకారం జరుపునే పర్వాల్లో సంక్రాంతికి విశిష్ట స్థానం ఉంది. సంక్రాంతి పండగ సందర్భంగా తమిళ నాడు రాష్ట్రంలో జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు మధురై జిల్లాలోని అవనియాపురం ప్రాంతంలో జల్లికట్టు పోటీలు ఉత్సాహభరితంగా ఆరంభించారు. తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో ఆడే ఒక సంప్రదాయక క్రీడ జల్లికట్టు. మూడు రోజుల పాటు వరుసగా సాగే ఈ క్రీడలను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తారు. తొలి రోజు అవనియాపురంలో, రెండో రోజు పాలమేడులో, మూడో రోజు అలంగనల్లూరులో జల్లికట్టు పోటీలను నిర్వహిస్తారు. అవనియాపురం జల్లికట్టు కోసం మొత్తం 2,400 ఎద్దులు, 1,318 టామర్లు, పాలమేడు జల్లికట్టుకు 3,677 ఎద్దులు, 1,412 టామర్లు, అలంగనల్లూరులో 6,099 ఎద్దులు, 1,784 టామర్లు నమోదు చేసుకున్నారు. కొత్తగా నిర్మించిన మధురై జల్లి కట్టు స్టేడియంను జనవరి 23న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఓపెనింగ్ చేయనున్నారు. మదురై జిల్లాలోని అలంగ నల్లూరు సమీపంలో నిర్మిస్తున్న కొత్త జల్లికట్టు స్టేడియానికి రాష్ట్ర మాజీ సీఎం, దివంగత డీఎంకే అధినేత కరుణానిధి పేరు పెట్టడం జరిగింది.


