తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదులకు సంబంధించి మే నెల కోటా టికెట్ల విడుదల తేదీలను టీటీడీ ప్రకటించింది. ఈ టికెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ తెలిపింది. ఈ నెల 21 ఉదయం 10 గంటల వరకు… ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆన్ లైన్ లో నమోదు చేసుకునే అవకాశం ఉంది. లక్కీడిప్ టికెట్లు పొందిన భక్తులు మధ్యాహ్నం 12 గంటలలోపు రుసుము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల మే నెల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ఈ నెల 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్ల కోటా జారీ చేస్తారు. ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం, గదుల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటా విడుదల చేస్తారు. 24న ఉదయం 10 గంటలకు మే నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్ విడుదల చేస్తారు. మే నెలకు సంబంధించి ఈ నెల 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవా కోటా, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటా, మధ్యాహ్నం 2 గంటలకు పరకామణి సేవా కోటా విడుదల చేస్తారు.


