ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలూ సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నదానిపై ఓ క్లారిటీ వచ్చేసినట్లే కన్పిస్తోంది. ఓడిపోయిన చోటే తిరిగి గెలిచి చూపించాలన్న పట్టుదల, లక్ష్యంతో ఉన్న జనసే నాని… కీలక నిర్ణయం తీసుకున్నట్లు.. అదే విషయాన్ని పార్టీ నేతలకు చెప్పినట్లు ప్రచారం జరుగు తోంది. ఈ క్రమంలోనే ఆయన భీమవరం నుంచి బరిలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా చేయడం ద్వారా ఉభయ గోదావరి జిల్లాలపై తన పోటీ ప్రభావం ఉంటుందని పవన్ కల్యాణ్ లెక్కలేస్తున్నట్లు సమాచారం.
సార్వత్రిక ఎన్నికలకు ఏపీలోని రాజకీయ పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి. ఓవైపు వైనాట్ 175, సిద్ధం అంటూ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సమర శంఖం మోగించింది వైసీపీ. అదే సమయంలో కూట మిగా ఏర్పడిన టీడీపీ-జనసేన పార్టీలూ… కమలాన్ని తమతో కలుపుకొని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఓ దఫా ఢిల్లీ పెద్దలతోనూ సమావేశమయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. తాను సైతం హస్తిన పెద్దలను కలిసి పొత్తు విషయంలో ఓ క్లారిటీ తీసుకోవాలని భావిస్తు న్నారు పవన్. అయితే.. పొత్తుపై ఇప్పటికే ఇరువైపులా సానుకూల పరిస్థి తులు నెలకొన్నాయని.. సీట్ల సర్థుబాటులోనే చిన్న చిన్న సమస్యలు నెలకొనడంతో వాటిపై టీడీపీ-జనసేన-బీజేపీ దృష్టి సారించా యన్న మాట విన్పిస్తోంది. అతి త్వరలోనే ఆయా సీట్లలో ఎవరు పోటీ చేస్తారన్నది తేల్చుకొని అభ్యర్థుల్ని ప్రకటించవచ్చన్న ప్రచారం జరుగుతోంది.
ఈ విషయాలన్నీ కాస్త పక్కన పెడితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2024 ఎన్నికల్లో ఎక్కడి నుంచి బరిలో దిగుతారన్నది నిన్న మొన్నటి వరకు ఉత్కంఠ రేపింది. కోస్తాంధ్రలోని పిఠాపురం, కాకినాడ, భీమవరం, విశాఖలోని గాజువాక, రాయలసీమలోని తిరుపతి ఇలా పలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే.. దీనిపై జనసేన అధినేత పవన్ సైతం తన పోటీపై సామాజిక మాధ్యమాల్లోనూ నేతల్లోనూ జరుగుతున్న చర్చ గురించి విని మౌనంగానే ఊరుకు న్నారు. కానీ, ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే.. తాజాగా తాను పోటీ చేయబోయే నియోజకవర్గం గురించి పవన్ కల్యాణ్… జనసేన నేతలకు క్లారిటీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. భీమవరం పర్యటనకు వచ్చిన పవన్.. స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు తోట సీతారామలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయుల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో భీమవరంలో జనసేన-టీడీపీ నేతలు ఉమ్మడిగా కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకతపై వారితో చర్చించారు. దుష్టపరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడడమే అందరి లక్ష్యమని ఈ సందర్భంగా చెప్పుకొచ్చిన పవన్… అంతా కలిసి కట్టుగా పనిచేయాలని ఆకాంక్షించారు. అనంతరం పార్టీ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయిన జనసేనాని… తాను పోటీ చేయబోయే అసెంబ్లీ స్థానం విషయంలో క్లారిటీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పవన్.. భీమవరం నుంచే బరిలో దిగబోతున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని పార్టీ నేతలకు పవన్ వివరించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలనే ఆయన స్థానికంగా ఉన్న టీడీపీ నేతల ఇళ్లకు ప్రత్యేకంగా వెళ్లారన్న టాక్ విన్పిస్తోంది. అయితే.. ఇక్కడే ఓ కీలక అంశం దాగుంది. పవన్ 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం రెండు స్థానాల నుంచీ పోటీ చేశారు. రెండింటిలోనూ ఓటమి పాలయ్యారు. అలాంటిది ఆయన తిరిగి భీమవరంలో పోటీ చేయనున్నట్లు చెప్పారంటే అందుకు ప్రధాన కారణం ఒకటుంది. అదే… పోయిన చోటే వెతుక్కోవాలని… ఓడిన చోటే తిరిగి గెలవాలన్న పట్టుదల, లక్ష్యంతోనే జనసేనాని మళ్లీ భీమవరం బరిలో దిగబో తున్నారని చెప్పాలి. ఆ క్రమంలోనే క్షేత్రస్థాయిలో రెండు పార్టీల కేడర్ను కలిసి కట్టుగా సాగేలా చూసేందుకు తన వంతు ప్రయత్నాలు జనసేనాని మొదలు పెట్టారన్న టాక్ విన్పిస్తోంది.
పవన్ భీమవరాన్ని ఎంచుకోడానికి మరో కారణం గత ఎన్నికల్లో ఆయనకు పోలైన ఓట్లని చెప్పాలి. 2019 ఎలక్షన్లలో టీడీపీ, బీజేపీ విడివిడిగా పోటీ చేశాయి. అయితే.. వైసీపీ నుంచి గ్రంధి శ్రీనివాస్ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో… నాటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి…. పవన్పై కేవలం 8వేల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. దీంతో.. అప్పుడు విడివిడిగా పోటీ చేయడం వల్లే తాను ఓటమి పాలయ్యానని.. ఇప్పుడు కలిసి కట్టుగా బరిలో దిగడం వల్ల ఇక్కడ గెలుపు సులువవుతుందన్న భావనకు వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. పైగా కాపు సామాజిక వర్గ ఓటర్లు అత్యధికంగా ఉన్న భీమవరం నుంచి పోటీ చేయడం ద్వారా.. ఉభయ గోదావరి జిల్లాలో పార్టీ అభ్యర్థుల గెలుపు విజయావకాశాలు మరింత మెరుగుపడతా యని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో.. ఇవన్నీ ఆలోచించే పవన్.. భీమవరం బరిలో ఉండేందుకు రెడీ అయ్యారన్న వార్తలు విన్పిస్తున్నాయి. అదే సమయంలో రాయలసీమలో మరో చోటు నుంచి పవన్ పోటీ చేయవచ్చన్న వాదనా విన్పిస్తోంది. గతంలో తన అన్నయ్య పోటీ చేసిన తిరుపతి బరిలో జనసేనాన్ని ఉండొచ్చన్న టాక్ గట్టిగా విన్పిస్తోంది. మరి..రెండో స్థానంపై పోటీ విషయంలో పవన్ ఏమం టారు అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సేనని చెప్పాలి.