అమెరికాలో భారత సంతతికి చెందిన అనేకమంది తమతమ రంగాల్లో సత్తా చాటుతున్నారు. వీరిలో అజయ్ బంగా ఒకరు. ఇండో అమెరికన్ అయిన అజయ్ బంగాకు కొంతకాలం కిందట ప్రతిష్టాత్మకమైన ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవి లభించింది. కీలకమైన ఈ పదవికి అజయ్ బంగా పేరును బైడెన్ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం నామినేట్ చేసింది. ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవి అంటే చిన్నా చితకా విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు రుణాలు అందివ్వడం, ఆర్థిక సాయం చేయడం వంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అధికారం వరల్డ్ బ్యాంకు ప్రెసిడెంట్కు ఉంటాయి. అజయ్ బంగా గతంలో మాస్టర్కార్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశారు. వరల్డ్ బ్యాంక్ అధ్యక్ష పదవి చేపట్టేనాటికి జనరల్ అట్లాంటిక్ సంస్థకు వైస్ చైర్మన్గా ఉన్నారు.
ఒక ఆర్థికవేత్తగా అజయ్ బంగాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు, పెట్టుబడులు కల్పించడంలో అజయ్ బంగా కీలక పాత్ర పోషించారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా అనేక స్వచ్ఛంద సంస్థలకు ఆయన దగ్గరివాడు. వాతావరణ మార్పులను తట్టుకోవడానికి ప్రణాళికలు రూపొందించే స్వచ్ఛం ద సంస్థలకు అజయ్ బంగా పెద్ద ఎత్తున నిధులు అందచేశాడు. అజయ్ బంగా మనదేశంలోని మహారాష్ట్ర వాసి. పూణే కంటోన్మెంట్ ప్రాంతంలో ఆయన జన్మించారు. అజయ్ బంగాకు హైదరాబాద్ నగరంతో అనుబంధం ఉంది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. అహ్మదాబాద్లోని ఐఐఎంలో పీజీ చేశారు. మాస్టర్కార్డు సహా అనేక అంతర్జాతీయ సంస్థల్లో పని చేశారు. 2016లో ఆయనకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హారిస్తో కలిసి అభివృద్ధికి సంబంధించిన అనేక ప్రాజెక్టుల్లో అజయ్ బంగా కలిసి పనిచేశారు.
సత్య నాదెళ్ల.. పరిచయం అక్కర్లేని పేరు. భారత్లో పుట్టి పెరిగి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాపులరైన మైక్రోసాప్ట్ సంస్థకు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, సీఈఓగా ఉన్నారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆదాయం ఇటీవలే మూడు ట్రిలియన్ డాలర్లు దాటింది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ. 255 లక్షల కోట్లకుపైనే.మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్యనాదెళ్ల ఇటీవలే 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 2014లో స్టీవ్ బామర్ నుంచి ఆయన మైక్రోసాఫ్ట్ కంపెనీ నాయకత్వ బాధ్యతలు తీసుకున్నారు. సుందర్ పిచాయ్ ..అమెరికాలో సత్తా చాటుతున్న మరో భారతీయుడు. గూగుల్ సంస్థ సీఈఓగా ప్రపంచమంతా ఆయన పాపులర్. కార్పొరేట్ రంగంలో సుందర్ పిచాయ్ పేరు తెలియనివారుండరు. అంతేకాదు. .2023లో అమెరికాలో అత్యధిక వేతనం అందుకున్న సీఈఓల్లో సుందర్ పిచాయ్ ముందువరుసలో ఉంటారు. అమెరికాలో ఉంటూ అక్కడి భూమి పుత్రుల కంటే మిన్నగా రాణిస్తున్నారు భారత సంతతికి చెందిన వ్యక్తులు. అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్ సర్వే చేసిన వెల్లడించిన వాస్తవం ఇది. అమెరికాలో నివసిస్తున్న అనేక దేశాలకు చెందిన ప్రజలకు సంబంధించిన జీవనస్థితిగతులపై సర్వే చేసి న్యూయార్క్ టైమ్స్ ఈ విషయం వెల్లడించింది. నేటివ్ అమెరికన్ల కంటే భారత్ నుంచి వలస వెళ్లిన వాళ్లే అన్నిటిలోనూ పైచేయిగా ఉన్నారని ఈ సర్వే కుండబద్దలు కొట్టింది.
అమెరికన్ల ఆదాయం రూ.47 లక్షలుంటే, ప్రవాస భారతీయుల సగటు ఆదాయం రూ.92 లక్షలు ఉంది. అంటే అమెరికన్ల సగటు ఆదాయం కంటే ప్రవాస భారతీయుల సగటు ఆదాయం రెండింతలు ఉన్నట్లు లెక్క. అమెరికాలో సహజంగా ఐటీ, ఆర్థిక, వైద్య రంగాల్లో అత్యధిక వేతనాలులంటాయి. వీటన్నింటిలో ప్రవాస భారతీయులదే పైచేయిగా ఉందని సర్వే పేర్కొంది. అమెరికాలోని మొత్తం వైద్యుల్లో భారతీయుల వాటా తొమ్మిది శాతం. దటీజ్ ఇండియా. సంపాదనతో పాటు చదువులో కూడా అమెరికన్లతో పోల్చుకుంటే భారత సంతతికి చెందినవారే ముందంజలో ఉన్నారు. అమెరికాలో కాలేజీ గ్రాడ్యుయేట్లు 34 శాతం ఉన్నారు. వీరిలో 79 శాతం వాటా ప్రవాస భారతీయులదే.ప్రపంచపటంపై ఏ దేశానికి వెళ్లినా అక్కడ కచ్చితంగా భారతీయులు ఉంటారు. ఏ దేశంలో, ఏ వృత్తి చేపట్టినా భారతీయలు బాగా కష్టపడతారు. ఈ లక్షణమే భారతీయులను ప్రపంచ దేశాల్లో పైమెట్టు మీద నిలబడేలా చేసింది. అంతేకాదు ఏ దేశ వాతావరణంలోనైనా భారతీయులు ఇమిడిపోగలరు. ఏమైనా భారతీయులు ఎక్కడున్నా తమ ప్రతిభ చాటుతున్నారు. మాతృభూమికి పేరు తీసుకువస్తున్నారు. మేరా భారత్ మహాన్.