కొంత కాలం వరకు పచ్చగా ఉన్న దండకారణ్యం. కొన్ని రోజులుగా ఎరుపెక్కుతోంది. ప్రధానంగా నెలరోజుల వ్యవధిలోనే ఆరేడు ఎన్కౌంటర్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో దాదాపు వంద మంది వరకు మావోయిస్టులు మృతి చెందడం ప్రాధాన్యం సంతరించుకుంది. అసలు ఎందుకీ పరిస్థితి ? మావో లకు మొన్నటి వరకు సేఫ్ జోన్గా ఉన్న అడవులు. నేడు వారికి ఎందుకు ఆశ్రయం ఇవ్వలేని పరిస్థితులు వచ్చాయి ? అసలు అడవిలో ఏం జరుగుతోంది ?
వరుస ఎన్కౌంటర్లతో అడవుల్లో అలజడి. నిన్న మొన్నటి వరకు మావోయిస్టులకు షెల్టర్ జోన్లుగా ఉన్న చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిషా. ఇలా చెప్పుకుంటూ వెళితే, దండకారణ్యం ప్రాంతం అంతా నేడు కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. ప్రధానంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు వచ్చిన తర్వాత పరిస్థితి మరింతగా దిగజారింది. అయితే. కొన్నేళ్ల వరకు మావోలకు సేఫ్జోన్గా ఉన్న అటవీ ప్రాంతంలో ఎందుకీ పరిస్థితి నెలకొంది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత ఐదేళ్లుగా చూస్తే, 2019లో జరిగిన ఎన్ కౌంటర్లలో 65 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2020లో 36 మంది.. 2021లో 47 మంది 2022లో 30 మంది చనిపోయారు. ఇక, గతేడాది అంటే 2023లో 24 మంది అన్నలు అడవిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఇప్పటికే వంద మందిని హతమార్చాయి భద్రతా దళాలు. అంటే ఎన్కౌంటర్లు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఒక బస్తర్, ఒక దంతేవాడ, ఒక కాంకేర్ మాత్రమే కాదు.. గతంలో జరిగిన బలిమెల లాంటి ఘటనలు ఎన్నో ఈ సందర్భంగా గుర్తుకు వస్తాయి. ఇప్పటికే ఆపరేషన్ గ్రీన్ హంట్ అంటూ విస్తృతంగా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న భద్రతా దళాలు. అత్యంత అధునాతన టెక్నాలజీని వినియోగించుకొని ముందుకు దూసుకొస్తున్నాయి. దీంతో మావోలకు కొన్నేళ్ల క్రితం వరకు పెట్టని కోటలుగా ఉన్న ప్రాంతాలు కాస్తా నేడు వాళ్లకు ఆశ్రయం ఇవ్వలేకపోతున్నాయి. ఇదే వారి పాలిట శాపంగా మారుతోంది అన్న మాట విన్పిస్తోంది. నిజానికి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రను ఆనుకొని వేలాది కిలోమీటర్ల మేర దట్టమైన అడవులు ఉన్నాయి. వీటిలోనే ఎక్కువ భాగం అన్నలు తమ స్థావరాలు ఏర్పాటు చేసుకొన్నారు. అగ్రనేతలు ఎప్పటికప్పుడు తమ ప్లేసులు మార్చుకుంటూ వెళ్లినా, ఆయా జోన్లలో ఉండే దిగువ స్ధాయి కేడర్ మాత్రం ఆయా ప్రాంతాలను తమ గుప్పిట్లో పెట్టుకుంటూ ఇన్నాళ్లూ వచ్చాయి. అయితే కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు అన్నట్లుగా టెక్నాలజీ మారుతున్న కొద్దీ ఈ మార్పులు శరవేగంగా మారుతున్నాయి.
దండకారణ్యం తమ గుప్పిట్లో ఉండడంతో అప్పటివరకు ఎవరైనా పోలీసులు, లేదంటే భద్రతా దళాలు దగ్గరకు వచ్చేదాక వేచి చూసి గెరిల్లా పద్దతిలోనూ దాడులు చేసేవారు మావోయిస్టులు. అయితే డ్రోన్లు,
నైట్ విజన్ కెమేరాలు, ఇతర అత్యున్నత సాంకేతిక పరికరాలు అందుబాటులోకి రావడంతో ఆయా రాష్ట్రాలకు చెందిన పోలీసులు, భద్రతాదళాలు, కూంబింగ్ పార్టీలు తమ పనిని చాపకింద నీరులా మెల్ల గా కానిచ్చేస్తున్నాయి. ప్రత్యేకించి అడవిలో అన్నలకు ప్రతికూల వాతావరణ పరిస్థితులు వచ్చే వరకు వేచి చూసి, మరీ దెబ్బకొడుతున్నాయి.ప్రధానంగా ఫిబ్రవరి చివరి వారం నుంచి మన దగ్గర ఎండలు మొదల వుతాయి. మే చివరి వారం వరకు ఉంటాయి. ఈ సమయంలో చెట్లు ఆకులు రాల్చే సమయం. దీంతో అప్పటివరకు పచ్చగా, చిక్కగా ఉండే అడవులు కాస్తా పల్చగా మారిపోతాయి. దీంతో ఇదే అవకాశంగా భద్రతా దళాలు తమ దాడుల్ని మరింత ముమ్మరం చేశాయి. పైగా వర్షాకాలం, శీతాకాలంలో తాగునీటికి అడవుల్లో పెద్దగా కొరత ఉండదు. అదే వేసవి వచ్చే సరికి చిన్నా చితకా నీటి మడుగులు, చెలమలు ఎండిపోతాయి. దీంతో నదీ ప్రాంతాల వైపు అన్నలు రావాల్సిన పరిస్థితులు వస్తా యి. ఇదే అదునుగా భద్రతాదళాలు మావోలను మట్టుపెడుతున్నాయి. దీంతో గత నెల రోజుల వ్యవధిలో ఇంత భారీగా స్థాయిలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు.