ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటు పుట్టిస్తున్నాయి. ఇన్ఛార్జ్ల మార్పుపేరుతో వైసీపీ అధిష్టానం విడుదల చేసిన మూడో జాబితాపై అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి వెళుతుంటే.. ఇంకొందరు పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ.. ఏపీ రాజకీయాలు హాట్హాట్గా సాగుతున్నాయి. ప్రధానంగా వైసీపీపై అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి. ప్రతిపక్షాల కంటే ఎంతో ముందుగా ఇన్ఛార్జ్ల మార్పు పేరుతో అభ్య ర్థుల్ని ఖరారు చేస్తున్నారు ఆ పార్టీ అధినేత, సీఎం వై.ఎస్ జగన్. ఇప్పటి వరకు మూడు జాబితాలు విడుదల చేశారా యన. మొత్తం 59 మంది ఇన్ఛార్జ్లను ప్రకటించారు. అయితే.. జాబితాలో తమ పేర్లు గల్లంతైన సిట్టింగ్లు, టికెట్ వస్తుందని ఆశలు పెట్టుకున్న నేతలు వైసీపీ అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెనమలూరు నుంచి టికెట్ దక్కని వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి.. కీలక నిర్ణయం తీసుకున్నారు. పెనమలూరు టికెట్ ఆశించి భంగపడ్డారు వైసీపీ నేత పడమట సురేష్. అధిష్టానం నిర్ణయంపై ఆగ్రహించిన ఆయన.. ఎట్టి పరిస్థితుల్లోనూ జోగి రమేష్కు సహకరించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో.. స్థానికంగా ఉన్న కేడర్లో అయోమయం నెలకొంది.
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం వైసీపీలో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. వైసీపీ ఇన్ఛార్జ్గా సతీష్ను ప్రకటించడంపై మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికేతరులకు టికెట్ ఎలా ఇస్తారంటూ నిలదీస్తున్నారు. ఇక, టీడీపీ నుంచి వైసీపీలో చేరి, ఎంపీ టికెట్ దక్కించుకున్న కేశినేని నానిపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. నాని ఓ అవినీతి పరుడంటూ విమర్శించిన ఆయన.. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు ఎంత… తిరిగి చెల్లించింది ఎంతో కేశినేని నాని చెప్పగలరా అంటూ ప్రశ్నించారు బుద్దా వెంకన్న.
మరోవైపు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ వర్గ పోరు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. మాజీ మంత్రి అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. తాజాగా ఈ వ్యవహారంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఏవీ సుబ్బారెడ్డి. పార్టీ ఆదేశిస్తే ఆళ్లగడ్డ నుంచి పోటీకి సిద్ధమని, అదే సమయంలో అఖిలప్రియకు సీటు ఇస్తే మాత్రం సహకరించే ప్రసక్తే లేదంటూ తెగేసి చెబుతున్నారు ఏవీ సుబ్బారెడ్డి. ఇదే ఇప్పుడు కలకలం రేపు తోంది. కేవలం వీళ్లే కాదు. వైసీపీలో టికెట్ దక్కని మరికొందరు నేతలు సైతం ఇతర పార్టీల వైపు చూస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే పైకి అంతా మామూలుగా కన్పిస్తున్నా సమయం వచ్చినప్పుడు జంప్ చేసేం దుకు సిద్ధంగా ఉన్నారన్న టాక్ విన్పిస్తోంది.