అయోధ్య అంశంపై 2019 నవంబర్ తొమ్మిదిన సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెల్లడించింది. అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం రామ్లల్లాకే చెందుతుందని ఐదుగురు సభ్యులున్న సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసిం ది. అంతేకాదు వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలుగా విభజించాలంటూ గతంలో అలహాబాద్ హై కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. అయోధ్య హిందువులదేనని చెప్పడానికి ఎక్కువ ఆధారాలు ఉన్నట్లు సుప్రీం కోర్టు ధర్మాసనం ఒక నిర్ణయానికి వచ్చింది.
సుప్రీంకోర్టు తన తీర్పు వెల్లడించడానికి ముందు పురావస్తు ఆధారాలను కూడా అత్యున్నత స్థానం ప్రాతిపదికగా తీసుకుంది. తీర్పు వెల్లడించడంలో ఇదొక విశేషం. అయోధ్య రాముడిదేంటూ చరిత్రాత్మక తీర్పు వెల్లడించిన ధర్మాస నంలో అప్పటి చీప్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఏ.ఎస్. బోబ్డే, జస్టిస్ డీ. వై. చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్ తో పాటు జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా ఉన్నారు. అలాగే వివాదాస్పద స్థలంలో తరతరాలుగా సాగుతున్న హిందువుల పూజాదికాలను కూడా సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. మసీదు గుమ్మటాల వెలుపలి భాగంలో హిందువులు అప్రతిహతంగా పూజాదికాలు నిర్వహించారని చెప్పడానికి గట్టి ఆధారాలున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అంతేకాదు విచారణలో ఉన్న స్థలం రామజన్మభూమి అని భావించడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. తాము విశ్వాసాల ఆధారంగా తీర్పు ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. చట్టపరమైన ఆధారాలనే పరిగణనలోకి తీసుకుని తాము తీర్పు ఇస్తున్నట్లు న్యాయమూర్తులు కుండబద్దలు కొట్టారు.
ఇక్కడ న్యాయశాస్త్ర కోవిదుడు కేకే పరాశరన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సుప్రీంకోర్టులో రామ్లల్లా తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ కేకే పరశరనే. తొంభై రెండేళ్ల వయసులో కూడా వరుసగా 40 రోజులు సుప్రీంకోర్టులో నిలబడి అయోధ్య రాముడి కోసం పరాశరన్ వాదనలు వినిపించారు. పరాశరన్ వయస్సును దృష్టిలో పెట్టుకుని కూర్చుని వాదనలు వినిపించవలసిందిగా అప్పటి చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ కోరారు. అయినప్పటికీ కోర్టు హాలులో పరాశరన్ కూర్చోలేదు. ఒకవైపు వయోభారం ఇబ్బంది పెడుతున్నా, మరో వైపు న్యాయవాద వృత్తి ధర్మానికి ఆయన కట్టుబడ్డారు. కోర్టు హాలులో నిలబడే పరాశరన్ వాదనలు వినిపించారు. అంతేకాదు…కొన్నిసార్లు కోర్టు హాలులో కొన్నిసా ర్లు ఉద్రిక్తపూరిత వాతావరణం నెలకొన్నా పరాశరన్ ఏనాడూ సహనాన్ని కోల్పోలేదు. ఎక్కడా గీత దాటలేదు. ఒక కర్మయో గిగానే పరాశరన్ ప్రశాంతంగా తన వాదనలు వినిపించారు. చివరకు వాదనలు పూర్తయిన తరువాత ముస్లిం పర్సనల్ లా బోర్డు తరఫున వాదించిన న్యాయవాది రాజీవ్ ధావన్ ను ఆలింగనం చేసుకున్నారు. అలనాడు రామచంద్ర ప్రభువు ఆచరించిన మిత్రధర్మాన్ని పరాశరన్ కూడా ఆచరించి చూపారు.
పురాతన ప్రపంచ నాగరికతలకు ఊయల భారతీయ నాగరికతే. ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానం ఉండనక్కర్లేదు. ఈ నాగరికత చూపిన అద్బుతమే అయోధ్యలో మందిర నిర్మాణానికి పునాదిగా మారింది. ఒక మహా పోరాటం తరువాత యావత్ భారతీయులు, అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించుకోగలిగారు. అయోధ్యలో రామ మందిరంతో భారతీయుల ఆత్మ గౌరవ నినాదాన్ని ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు. శ్రీరాముడు పుట్టిన నేలలో సకల సుగుణాభిరాముడికి ఆలయం కట్టడమనేది కొన్ని శతాబ్దాలుగా భారతీయుల కల. అనేకానేక అవరోధాలు, అడ్డంకులను, న్యాయ పోరాటాలను దాటుకుని చివరకు శతాబ్దాల కల సాకారమైంది.