అన్నదాతలు మరోసారి పోరుబాట పట్టారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతోపాటు తమ ఇతర డిమాండ్లు పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు దాదాపు 200కు పైగా రైతు సంఘాలు రేపు ‘ఢిల్లీ చలో’ మార్చ్ నిర్వహించతలపెట్టాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోకి రైతులు ప్రవేశించ కుండా అధికారులు సరిహద్దుల్లో అధిక బలగాల ను మోహరించారు. సింఘూ, ఘాజీపూర్, టిక్రి సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. రైతులతో కూడిన వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. రైతుల వాహనాలు పంక్చర్ అయ్యేలా పలు చోట్ల ఇనుప మేకులు కూడా ఏర్పాటు చేశారు. హర్యానా-ఢిల్లీ, యూపీ-ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లను ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా పరిశీలించారు. రాజధానిలోకి ప్రవేశించే రోడ్లను బ్లాక్ చేసేందుకు పెద్ద కంటెయినర్లను తరలిస్తున్నారు. బస్సు, రైలు లేదా ఏ ఇతర మార్గంలోనూ రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా చూసేలా పలు బృందాలతో నిఘా పెట్టారు. ఈశాన్య డిల్లీలో 144 సెక్షన్ కూడా విధించి నిషేధాజ్ఞలు అమలు చేస్తు న్నారు. ‘ఢిల్లీ చలో’ ఆందోళనకు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి పెద్దయెత్తున రైతులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.