భారతీయ జనతా పార్టీకి ఒక క్రమశిక్షణగల సైనికుడిగా సేవలందించారు అద్వానీ. 90ల్లో దేశవ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేయడంలో అద్వానీ కీలకపాత్ర పోషించారు. సుదీర్ఘకాలం బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. వాజ్పేయి కేబినెట్లో ఉప ప్రధానిగా పనిచేసి దేశానికి ఎనలేని సేవలు అందించారు.
ఆధునిక భారతదేశ చరిత్రలో భారతీయ జనసంఘ్ది ఒక కీలకపాత్ర. 1951 అక్టోబర్ 21న “భారతీయ జనసంఘ్” పార్టీని శ్యామాప్రసాద్ ముఖర్జీ స్థాపించారు. ఒక్కమాటలో చెప్పాలంటే నాగ్పూర్ కేంద్రంగా నడిచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు రాజకీయ వేదికే “భారతీయ జనసంఘ్ ”.ఇప్పటి బీజేపీ ప్రముఖ నాయకులందరూ అలనాటి భారతీ య జనసంఘ్ నుంచి వచ్చినవారే. 1975లో ఇందిరా గాంధీ ప్రభుత్వం దేశంలో ఎమెర్జెన్సీ విధించింది. దేశంలోని ప్రజాస్వామ్యవాదులందరూ ఎమెర్జెన్సీని వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ నాయక త్వంలో జనతా పార్టీ ఏర్పడింది. దీంతో 1977లో జనతా పార్టీలో భారతీయ జనసంఘ్ విలీనమైంది. ఈ నేపథ్యంలో దేశ రాజకీయ పటం నుంచి జనసంఘ్ అదృశ్యమైంది.1977లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇందిర నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది.జనతా పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా కాంగ్రెసేతర ప్రభు త్వం ఏర్పాటైంది. మొరార్జీ దేశాయ్ తొలి కాంగ్రెసేతర ప్రధాని అయ్యారు.మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో లాల్ కృష్ణ అద్వానీ సమాచార శాఖా మంత్రిగా చేరారు.అయితే జనతా పార్టీలో గొడవలు మొదలయ్యాయి.ద్వంద్వ సభ్యత్వం కారణంగా పాత జనసంఘీయులు, మిగతా పార్టీల నేతల మధ్య విభేదాలు వచ్చాయి. నెలలు గడిచేకొద్దీ ఈ విభేదాలు మరింత తీవ్రమయ్యాయి.చివరికి పాత జనసంఘీయులైన వాజ్పేయి,అద్వానీ మంత్రిపదవులకు రాజీనామాలు చేశారు. 1979 ఏప్రిల్ నెలలో జనతాపార్టీ నుంచి వాజ్పేయి,అద్వానీ బయటకువెళ్లారు.ఆ తరువాత దేశంలో అనేక రాజకీయ పరిణామాలు సంభవించాయి. పాత జనసంఘీయులందరూ కలిసి ఢిల్లీలో 1980 ఏప్రిల్ ఆరో తేదీన భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. బీజేపీకి వాజ్పేయి ఏకగ్రీవంగా తొలి అధ్యక్షుడయ్యారు.దీంతో భారత రాజకీయాల్లో బీజేపీ ప్రస్థానం మొదలైంది. బీజేపీలో అద్వానీ నెంబర్ టూగా పేరొందారు.
భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా అద్వానీ సుదీర్ఘకాలం పనిచేశారు. 1986లో ఆయన తొలిసారి ఆయన బీజేపీ అధ్యక్షుడయ్యారు.ఆ తరువాత 1988లో మరోసారి కమలం పార్టీకి అధ్యక్షుడయ్యారు. అద్వానీ బీజేపీ అధ్యక్షుడ య్యేనాటికి దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆ పార్టీ బలహీనంగా ఉండేది. మరీ ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ఉనికే ఉండేది కాదు. అయితే అద్వానీ హయాంలో బీజేపీ దేశవ్యాప్తంగా విస్తరించింది. అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వాన ఏర్పడిన తొలి సంకీర్ణ ప్రభుత్వంలో హొమ్ మంత్రిగా చేరారు అద్వానీ. హోమ్ మంత్రిగా దేశంలో శాంతి భద్రతల సమస్యకు ప్రాధాన్యం ఇచ్చారు ఆయన.2002 జూన్ నుంచి 2002 మే వరకు వాజ్పేయి ప్రభుత్వంలో ఉప ప్రధానిగా అద్వానీ పనిచేశారు. ఉప ప్రధాని హోదాలో వాజ్పేయి సర్కార్ తీసుకున్న అనేక ముఖ్యమైన నిర్ణయాల్లో అద్వానీ కీలకపాత్ర పోషించారు.
అద్వానీ ప్రతిపక్ష నాయకుడిగా కూడా సమర్థవంతంగా పనిచేశారు. 2004 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అధికారంలోకి రావడంతో బిజెపి ఓటమిని చవిచూసింది .అద్వానీ లోక్సభకు ఐదవసారి గెలిచి ప్రతిపక్ష నాయకుడయ్యారు. 2004 ఓటమి తర్వాత వాజ్పేయి క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలగారు. అద్వానీని బీజేపీకి నాయకత్వం వహించేలా ప్రోత్సహించారు. యూపీఏ హయాంలో పార్లమెంటులో సమర్థుడైన ప్రతిపక్ష నాయకుడిగా అద్వానీ రాణించారు. 2006 మార్చిలో వారణాసిలోని హిందూ పుణ్యక్షేత్రంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ నేపథ్యంలో దేశంలో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో యూపీఏ సర్కార్ విఫలమైందని పేర్కొంటూ అద్వానీ , భారత్ సురక్షా యాత్ర చేపట్టారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకు వివరించారు. అద్వానీ రాజకీయ ప్రస్థానంలో వివాదాలు కూడా ఉన్నాయి.2005 జూన్లో అద్వానీ కరాచీలో పర్యటించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నాను సెక్యులర్ నాయకుడిగా అద్వానీ పేర్కొన్నారు. అద్వానీ వ్యాఖ్యపై ఆరెస్సెస్ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఒక దశలో బీజేపీ అధ్యక్ష పదవికి బలవంతంగా అద్వానీ రాజీనామా చేయవలసి వచ్చింది. అయితే కొన్ని రోజుల తరువాత రాజీనామాను అద్వానీ ఉపసంహరించుకున్నారు. తాను నమ్మిన సిద్దాంతాల కోసం అలుపెరుగని పోరాటం చేశారు అద్వానీ. అయితే వయస్సు మీద పడటం వల్ల కావచ్చు ..లేదా మరో కారణం వల్ల కావచ్చు 2019 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు అద్వానీ.