బిగ్బాస్ రియాలిటీ షో తెలుగులోనూ ఎంతో పాపులర్ అయింది. ఆ షోలో పార్టిసిపేట్ చేసి బయటకు వచ్చే వాళ్లు కూడా అంతే పాపులర్ అవుతున్నారు. అయితే ఆ షోకు వెళ్లాలంటే కూడా ఎంతోకొంత పాపులారిటీ ఉండాలి. పలు రంగాల్లో సోషల్ మీడియాలో పాపులర్ అయిన వాళ్లను బిగ్బాస్ నెక్ట్స్ సీజన్ కోసం ఆ షో నిర్వాహకులు వెతికేపనిలో పడ్డారు. ఈ క్రమంలో సెలబ్రిటీల జాతకాలు చెబుతూ నిత్యం సోషల్ మీడియాలో ఉండే వేణుస్వామి కూడా బిగ్బాస్ సీజన్-8లో కనిపించబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి.
బాబు గోగినేనితో ఓ టీవీ చానల్లో జరిగిన చర్చాకార్యక్రమం ద్వారా వేణుస్వామి అనే జోతిష్యుడు జనాలకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత సెలబ్రిటీ కపుల్ అయిన నాగచైతన్య-సమంత విడిపోతారని చెప్పడం.. అది నిజం అవడంతో ఆయన చెప్పేది తప్పకుండా జరుగుతుందనే ప్రచారం బాగా జరిగింది. ఆ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఎక్కడా లేని పాపులారిటీ వచ్చింది. అయితే ఈ మధ్య వేణు స్వామి వైఎస్ జగన్ గెలుస్తారని చెప్పాడు.. కానీ అది జరగలేదు. దాని తర్వాత సోషల్ మీడియాలో జాతకాలు చెప్పడం మానేస్తానని ఒక సంచలన ప్రకటన చేశాడు.
ఏపీ ఎన్నికల్లో వేణుస్వామి చెప్పింది జరగకపోవడంతో యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఆయన గురించే వీడియోలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో పోస్ట్లు, మీమ్స్ అన్నీ హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఆయన సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉండడంతో ఆయనను బిగ్ బాస్ టీం గుర్తించినట్లు ఉంది. అందుకే నెక్స్ట్ సీజన్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. సెలబ్రిటీల జాతకాలు చెప్పడం మానేస్తానని చెప్పిన వేణుస్వామి ప్రస్తుతం ఖాళీగా ఉండడంతో బిగ్బాస్కు వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. మొత్తం మీద ఈసారి వేణు స్వామి బిగ్ బాస్ హౌస్లో సందడి చేయబోతున్నాడని తెలుస్తోంది. హౌస్లో అడుగు పెట్టాక ఆయన ఇంకా ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.
వేణు స్వామి కాకుండా ఇంకా ఈసారి ఎవరెవరిని తీసుకుంటారనేది కూడా హాట్ టాపిక్గా మారింది. బర్రెలక్కను, కుమారి ఆంటీని కూడా బిగ్బాస్ టీం సంప్రదించారని తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో పార్టిసిపేట్స్ గురించి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.