సాధారణంగా రాజకీయ పార్టీలకు మార్గనిర్దేశనం పార్టీ అధ్యక్షులే చేస్తుంటారు. అందుచేత పార్టీ అధ్యక్షులు చేసే ప్రసంగాలు పార్టీ క్యాడర్ ను ఆ దిశగా నడిపిస్తుంటాయి. తాజాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన ’జనసేన కౌలురైతు భరోసా యాత్ర‘ సభలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం వింటే ఒక నిజం బాగా అర్థం అవుతుంది. అదేంటో తెలుసు కోవాలంటే.. మిగిలిన పార్టీల సంగతి కూడా ఒక సారి చూడాలి.
నాలుగు రోజుల క్రితం వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ పార్టీ ఎమ్మెల్యేలకు గట్టిగా క్లాస్ పీకారు. మత్తు వీడమని చెప్పారు. పార్టీని అధికారంలోకి మళ్లీ తీసుకు రాబోతున్నామని, ఈ సారి 151 సీట్లు కాకుండా 175 అని టార్గెట్ కూడా పెట్టేశారు. అలాగే ఏపీలోకి కొత్త కొత్త పార్టీలు వస్తున్నాయి, సమీకరణాలు మారే అవకాశాలున్నాయని హింట్ ఇచ్చారు. అందువల్ల స్తబ్ధత వీడాలని హితవు పలికారు.
మరోవైపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పదే పదే ముందస్తు ఎన్నికలు వచ్చేస్తున్నాయని చెబుతున్నారు. మనమే అధికారంలోకి వస్తున్నామని, అత్యుత్సాహం చూపే పోలీసు అధికారుల లెక్క తేలుస్తామని కూడా నొక్కి వక్కానిస్తున్నారు.
ఆఖరికి బీజేపీ కూడా త్వరలోనే రామరాజ్యం తెస్తామని, అధికారం చేపట్టేది కమలం పార్టీ యే నని గొప్పలు చెబుతోంది. మొత్తమ్మీద రాజకీయ పార్టీలన్నీ వచ్చే కాలంలో అధికారాన్ని తామే చేపడతామని, ఆంధ్రాలో తమ పార్టీకే విజయావకాశాలున్నాయని చెప్పడం సహజమైపోయింది.
ఈ క్రమంలో సందట్లో సడేమియాలా జనసేన పవన్ కల్యాణ్ వచ్చి ట్రెండ్ కు భిన్నంగా ప్రసంగించారు. తన మనసులోని మాటలను చెప్పేశారు. విషయం ఏమిటంటే, గత కొంత కాలంగా జనసేన, తెలుగుదేశం పార్టీ క్యాడర్ పాలు నీళ్లలా కలిసిపోయి పనిచేస్తున్నాయన్నది నిజం.
కొన్ని సార్లు జనసేన పార్టీ కార్యక్రమాలకు టీడీపీ నాయకులు చందాలు కూడా ఇస్తున్నారని ఒక టాక్. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మీద విశాఖపట్నంలో దాడి వాతావరణం నెలకొన్నప్పుడు చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొన్నారు. నేరుగా పవన్ కళ్యాణ్ ను పరామర్శించటం ద్వారా ట్రెండ్ ను తన వైపు తిప్పుకొన్నారు. దీంతో టీడీపీ జనసేన పొత్తు అఫీషియల్ గా కన్ ఫామ్ అయినట్లు అయింది.
ఈలోగా అప్రమత్తం అయిన బీజేపీ… ప్రధానమంత్రి నరేంద్రమోదీ తో పవన్ కళ్యాణ్ కు అపాయింట్ మెంట్ ఇప్పించటం జరిగింది. దీంతో పొత్తు అంశం పెండింగ్ లో పడింది అనే మాటలు మళ్లీ బయటకు వచ్చాయి.
తాజాగా జరిగిన సత్తెనపల్లి సభలో పవన్ కళ్యాణ్ ఈ అంశాలు అన్నింటిపై పూర్తి క్లారిటీ ఇచ్చేశారు. వ్యతిరేక ఓటుని చీలనివ్వం, అందుకోసమే తాము కట్టుబడి ఉన్నామని చెప్పేశారు. అంటే గత ఎన్నికల్లో ఎవరికివారు పోటీ చేయడం వల్ల, ప్రతిపార్టీకి ఎన్నోకొన్ని ఓట్లు వచ్చాయి. అవన్నీ కలిస్తే వైసీపీని నిలువరించవచ్చునని ఆయన చెప్పకనే చెప్పేశారు. అంటే ఈసారి టీడీపీ తో పొత్తు కన్ ఫామ్ అని అచ్చ తెలుగులో చెప్పటమే.
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 5-10వేల ఓట్ల తేడాతో చాలా సీట్లు వరకు ఓడిపోయిందని అంచనా. ఇప్పుడు జనసేన కలిస్తే అవన్నీ తిరిగి గెలవచ్చు. అంతేకాదు ప్రభుత్వ వ్యతిరేకతతో మరికొన్ని పొందవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ వ్యాక్యలు ప్రాధాన్యత సంచరించుకున్నాయి.
అంతేకాదు వైసీపీ ని అధికారంలోకి రాకుండా అడ్డుకోవటమే తమ ధ్యేయం అని పవన్ తెగేసి చెప్పారు. అంత క్లియర్ గా చెప్పటం ద్వారా పొత్తులకు జనసేన క్యాడర్ ను సంసిద్దులను చేసేశారు. పనిలో పనిగా ప్రజలంతా కోరుకుంటే తాను సీఎం అవుతానని ఒక స్టేట్ మెంట్ కొట్టారు. దీనిని బట్టి చూస్తే టీడీపీ-జనసేన పొత్తు లో ఎక్కువ సీట్లు అడిగే అవకాశాలున్నాయి, అవసరమైతే టీడీపీ మీద ఒత్తిడి పెంచుతామనే సందేశం కూడా ఇచ్చారు.
కానీ, టీడీపీ ట్రాక్ రికార్డు చూస్తే అదంతా ఈజీ కాదని తెలుస్తోంది. ఒకసారి పొత్తుల కోసం తెలుగుదేశంతో కలిసిపోయాక సీట్లు, ఓట్లు పెంచుకోవటం అంత తేలిక కాదన్నది చరిత్ర చెబుతున్న సత్యం. అటువంటప్పుడు పవన్ కళ్యాణ్ ఒత్తిడి ఏ మేరకు ఫలిస్తుందన్నది చూడాలి. ఆయన కోరిక నెరవేరుతుందో లేదో చూడాల్సిందే.