తెలుగు నాట రాజకీయాలు ముదిరి పాకాన పడుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర రాజకీయాలై అయితే నువ్వెంత అంటే నువ్వెంత అన్న తీరున సాగుతున్నాయి.
తెలుగుదేశం, వైయస్సార్సీపీ పార్టీలు ఇటీవల కాలంలో ట్వీట్ల యుద్ధానికి దిగుతున్నాయి. ఇందులో కూడా పైచేయి సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
తాజాగా జనవరి 12 వ తేదీన జనసేన పార్టీ యువశక్తి కార్యక్రమం ఉంది కాబట్టి దీనికి ముందుగా యువత లో క్రేజ్ నింపేందుకు జనవరి 11వ తేదీ ( బుధవారం) ని ఎంచుకొన్నారు. వైయస్ జగన్ ను లక్ష్యంగా చేసుకొని సైకో జగన్ అనే హ్యాష్ టాగ్ ను టీడీపీ శ్రేణులు ట్రెండ్ చేయటం మొదలు పెట్టాయి. పార్టీ అగ్ర నాయకులు మొదలుకొని సామాన్య కార్యకర్తల దాకా ట్వీట్లతో విరుచుకు పడ్డారు. దాదాపు పాతిక వేల పై చిలుకు ట్వీట్లను కురిపించారు.
మధ్యాహ్నానికి ఈ ట్వీట్ల వర్షాన్ని గమనించి వైయస్సార్సీపీ అప్రమత్తం అయింది. అప్పటికప్పుడు సైకో సీబీఎన్ పేరుతో ట్వీట్ల యుద్దం ప్రకటించింది. ఒక్కసారిగా వైసీపీ శ్రేణులన్నీ ట్వీట్లతో మెరుపు దాడికి దిగాయి. దీంతో అతి తక్కువ కాలంలో వేల సంఖ్యలో ట్వీట్లను గుప్పించాయి. సైకో సీబీఎన్ హ్యాష్ టాగ్ ను ట్రెండింగ్ చేసుకొంటూ వెళ్లాయి. దీంతో టీడీపీ, వైసీపీ పెట్టిన హ్యాష్ ట్యాగ్ లు జాతీయ స్థాయికి వెళ్లాయి.
మొత్తం మీద టీడీపీ, వైసీపీ చేసిన ట్యాగ్ ల యుద్దం తెలుగు నాయకుల పరిస్థితిని జాతీయ స్థాయికి తీసుకొని వెళ్లాయని, ఇలాగైనా మనవాళ్లు ముందడుగు వేస్తున్నారని కొందరు వ్యాక్యానిస్తున్నారు.