- టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షుల్లో రెడ్లకే పెద్దపీట
- రేవంత్ చుట్టూ తిరిగిన వాళ్లకే ప్రాధాన్యం?
- ఖర్గేకు ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి వెళ్లిన నేతలు
- రాజీనామాకు సిద్ధమైన గిరిజన నేత బెల్లయ్య నాయక్
- ఇప్పటికే పార్టీ పదవికి కొండా సురేఖ రాజీనామా
హైదరాబాద్: రెడ్లు మాత్రమే రాజకీయ పార్టీల రక్షకులని గతంలో స్పష్టం చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. చివరకు అన్నంతపని చేశారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కొత్త కార్యవర్గానికి‘రెడ్డి’కార్పెట్ వేయించారు. కీలకమైన ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుల పదవులతోపాటు.. జిల్లా అధ్యక్షుల నియామకంలోనూ సింహభాగం రెడ్లకే ధారాదత్తం చేశారు. అయితే, అదే ఇప్పుడు పార్టీ కొంప ముంచబోతోంది.
పార్టీ కమిటీల్లో తమకు మొండిచేయి దక్కడంపై బలహీన వర్గాలు భగ్గుమంటున్నాయి. సీనియర్లను అవమానించిన వైనాన్ని వారు సహించలేకపోతున్నారు. జనాభాలో కేవలం 4 శాతం కూడా లేని రెడ్ల ఓట్లతో, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా అని ఆగ్రహిస్తున్నాయి. బడుగు బలహీన వర్గాల ఓట్లు పార్టీకి అవసరం లేదా అని నిలదీస్తున్నాయి. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆధ్వర్యంలో.. వారంతా తమకు జరిగిన అన్యాయాన్ని, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేసేందుకు, హస్తినకు పయమనవడం పార్టీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్లో ‘కుల’కలం రేగింది. పీసీసీ కమిటీలపై‘రెడ్డి ముద్ర’వేయడంపై, మిగిలిన కులాలు కళ్లెర్ర చేస్తున్నాయి. పార్టీ అధిష్ఠానం ప్రకటించిన 84 మంది ప్రధాన కార్యదర్శులలో 22 మంది, అలాగే 24 మంది ఉపాధ్యక్షుల్లో ఏడుగురు రెడ్లు, 17 మంది పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఆరుగురు రెడ్లు, ఇప్పటివరకూ ప్రకటించిన 26 డీసీసీ కమిటీల్లో 10 మంది రెడ్లు ఉండటం, బీసీ నేతల ఆగ్రహానికి గురయింది. వీరిలో కూడా పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చుట్టూ తిరిగేవారే ఎక్కువగా ఉన్నారన్నది ప్రధాన ఆరోపణ.
కమిటీ ఎంపికలో రేవంత్రెడ్డి అధిష్ఠానాన్ని తప్పుదోవపట్టించారని బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే కమిటీని ప్రకటించామని చెబుతున్నా, రేవంత్రెడ్డి ఆయన విశ్వాసంలో తీసుకున్న కొందరి అభిప్రాయాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారంటున్నారు. 40 మంది ఈసీ మెంబర్లలో 13 మంది రెడ్లు ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
రేవంత్ వెంట వచ్చిన మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్కు కీలమైన ఉపాధ్యక్ష పదవి ఇచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తమకు ప్రాధాన్యం తగ్గించడంపై అటు మహిళా నేతలు కూడా మండిపడుతున్నారు. ఏఐఏసీసీ సెక్రటరిగా ఉన్న వంశీచంద్రెడ్డి, సంపత్కుమార్, శ్రీధర్బాబును పీఏసీ కమిటీలో స్థానం కల్పించిన నాయకత్వం.. అదే ఏఐసీసీ సెక్రటరీగా ఉన్న బెల్లయ్యనాయక్ను మాత్రం విస్మరించడంపై, అసంతృప్తి వ్యక్తమవుతోంది.
84 మంది ప్రధాన కార్యదర్శుల్లో మహిళలకు కేవలం ఐదుగురికే స్థానం దక్కగా, 24 మంది ఉపాధ్యక్షుల్లో ముగ్గురికే స్థానం కల్పించారు. అందులో ఒకరు రెడ్డివర్గానికి చెందిన మహిళ ఉండటం గమనార్హం. 26 మంది జిల్లా అధ్యక్షులు ప్రకటించగా అందులో కేవలం ఒక్కరికే, అది కూడా వెలమ వర్గానికి అవకాశం ఇచ్చారు. 18 మంది ఉన్న పీఏసీలో కేవలం ఇద్దరు మహిళలకే అవకాశం దక్కడంపై, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజా కమిటీ కూర్పుపై ఆగ్రహం వ్యక్తం చేసిన గిరిజన నేత బెల్లయ్య నాయక్ అనేక ప్రశ్నలు సంధించారు. పార్టీలో ఒకరికి ఒకే పదవి సిద్ధాంతాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కమిటీ కూర్పుపై తాను ఖర్గేకు ఫిర్యాదు చేశానని చెప్పారు. అటు వరంగల్ జిల్లా ఫైర్బ్రాండ్, బీసీ వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ కూడా పార్టీలో కొత్తగా తనకు ఇచ్చిన పదవికి రాజీనామా చేశారు. తాను సామాన్య కార్యకర్తగానే పనిచేస్తానని ఆమె స్పష్టం చేశారు. మొత్తంగా రేవంత్రెడ్డి- మాణిక్యం ఠాగూర్ కలసి అధిష్ఠానాన్ని తప్పుదోవపట్టించి, కమిటీని తమ సొంత మనుషులతో నింపేసుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి తాజా కమిటీపై ఫిర్యాదు అందుకునే అధిష్ఠానం మరి ఏవిధంగా నష్టనివారణకు దిగుతుందో చూడాలి.