29.2 C
Hyderabad
Monday, May 29, 2023

కాపుల వేలితో కాపుల కన్ను పొడిపించే వ్యూహం ఫలిస్తుందా?

– కాపులను కాపులతోనే తిట్టించాలా?
– కాపులను రెడ్డి నేతలు తిట్టడంపై నిషేధం ఎందుకు?
– పదవులిచ్చిన రెడ్లతో కాపులను తిట్టించరెందుకు?
– రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలకు మినహాయింపు ఎందుకు?
– కాపుల దృష్టిలో రెడ్లు పవిత్రంగా ఉండాలన్న వ్యూహమేనా?
– రాయలసీమలో రెడ్డి-బలిజ శత్రుత్వం
– అందుకే పవన్‌పై తిట్లపర్వంలో రెడ్లకు మినహాయింపు
– సినిమా కోణంలోనే పవన్‌పై రోజాతో మాట దాడి
– వైసీపీ కాపు నేతల అసంతృప్తి

( మార్తి సుబ్రహ్మణ్యం)

జనసేనాధిపతి పవన్ కల్యాణ్‌పై.. వైసీపీ కాపు నేతల మాటల దాడిని, ఆ సామాజికవర్గం జీర్ణించుకోలేకపోతోంది. మంత్రులు, ఎంపిక చేసిన కాపు ఎమ్మెల్యేలతో పవన్‌ను తిట్టిస్తున్న వైనం, వారిని సొంత సామాజికవర్గంలో.. సొంత నియోజకవర్గాల్లో, ఒంటరిని చేస్తున్న పరిస్థితి ఏర్పడింది.

ఈ పరిణామాలు, ఇప్పటివరకూ పవన్‌కు రాజకీయంగా మద్దతునీయని కాపు వర్గంలో.. పట్టుదల పెంచి, జనసేనకు మద్దతుదారుగా మార్చే విచిత్ర పరిస్థితికి దారితీస్తున్నాయి. ప్రధానంగా కాపులను కాపులతో తిట్టించడం, రెడ్డి వర్గాన్ని మాత్రం.. ఆ తిట్ల పర్వానికి దూరం ఉంచుతున్న వైనంపై, వైసీపీలోని కాపు వర్గం అసంతృప్తికి గురిచేస్తోంది.

మంత్రి అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాధ్, కొట్టు సత్యనారాయణ, బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి పేర్ని నాని, కన్నబాబు వంటి కాపు నేతలతో జనసేనాధిపతి పవన్ కల్యాణ్‌పై తిట్టిస్తున్న వైనం..వైసీపీలోని కాపు శ్రేణుల్లో అసంతృప్తి రగిలిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాపులు, వైసీపీకి ఓటు వేయరన్న నిశ్చితాభిప్రాయంతోనే.. నాయకత్వం ఈ కులకోణానికి తెరలేపినట్లు, వైసీపీ కాపు నేతలు చెబుతున్నారు.

పవన్‌ను తమతో తిట్టిస్తున్న నాయకత్వం.. రెడ్డి మంత్రులు, రెడ్డి ఎమ్మెల్యే, ఎంపీలతో ఎందుకు తిట్టించడం లేదన్న చర్చ, వైసీపీ కాపువర్గంలో జోరుగా జరుగుతోంది. ఇప్పటివరకూ పవన్‌ను రోజా తప్ప..ఒక్క రెడ్డి మంత్రి గానీ, రెడ్డి ఎమ్మెల్యే గానీ తిట్టిన దాఖలాలు లేవని గుర్తు చేస్తున్నారు. రోజాను సినిమా కోణంలోనే పవన్‌పై ఉసిగొల్పుతున్నారే తప్ప, రెడ్డి కోణంలో కాదంటున్నారు. పదవులు ఇచ్చిన రెడ్లను, పవన్‌ను తిట్టడంలో మినహాయించడం ఎందుకన్న చర్చ జరుగుతోంది.

‘వైసీపీలో మొదటి నుంచీ మాట్లాడుతున్న వాళ్లే ఇప్పుడూ మాట్లాడుతున్నారు. రెడ్లలో అంత దూకుడు ఉన్న మంత్రులు-ఎమ్మెల్యేలు ఎవరున్నారు? వారిలో అంత సమర్ధత ఉన్న వారెవరూ లేరు కదా? అందుకే మొదటి నుంచి మా కాపులే పవన్ మీద మాట్లాడుతున్నారు. కాబట్టి దానిని కులకోణంలో చూడవద్ద’ని ఓ వైసీపీ సీనియర్ నేత కోరారు.

అయితే తమ నాయకత్వం వ్యూహాత్మకంగానే, రెడ్లను పవన్‌పై తిట్లకు దూరం పెట్టారని కాపు నేతలు చెబుతున్నారు. పవన్‌ను గానీ, టీడీపీ కాపు నేతలపై గానీ రెడ్లతో తిట్టించకపోవడానికి కారణం ఉందని చెబుతున్నారు. కాపుల దృష్టిలో రెడ్లు మంచివారు- పవిత్రులుగా ఉండాలన్న వ్యూహంతోనే, రెడ్లతో కాపులను తిట్టించడం లేదంటున్నారు. దీనివల్ల కాపుల ఓట్లు చీలిపోయినా ఫర్వాలేదు గానీ, వారు రెడ్లకు దూరం కాకూడదన్న ద్విముఖ వ్యూహం లేకపోలేదని విశ్లేషిస్తున్నారు.

అయితే ఈ వ్యూహం క్షేత్రస్థాయిలో బూమెరాంగవుతోందని, వైసీపీ కాపు నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో జనసేనకు ఓటు వేయని కాపు యువతలో తాజా పరిణామాలు… ఆ పార్టీకి, ఓటు వేసి తీరాలన్న కసి పెంచాయని స్పష్టం చేస్తున్నారు.

‘‘గత ఎన్నికల్లో కాపు యువత పవన్‌ను సినిమాపరంగా అభిమానించినా, రాజకీయంగా ఎవరికి ఇష్టం వచ్చిన పార్టీకి వాళ్లు ఓట్లు వేసుకున్నారు. కానీ ఈసారి మా పార్టీ, పవన్‌ను వేధిస్తుందన్న భావన కిందిస్థాయికి చేరుకుంది. విశాఖ ఘటనతో కులభావన మరింత పెరిగింది. దానితో కాపు యువతలో పట్టుదల పెరిగి, జనసేనకు ఎట్టి పరిస్థితిలో ఓట్లు వేసి తీరాలన్న కసికి కారణమయింద’’ని వైసీపీ కాపు సీనియర్ నేత ఒకరు విశ్లేషించారు.

రాయలసీమలో బలిజలకు-రెడ్లకు వైరం ఉన్నందున, ఆ కోణాన్ని దృష్టిలో ఉంచుకుని కాపులను రెడ్లతో తిట్టించడం లేదని, ఓ బలిజ నేత అసలు రహస్యం వెల్లడించారు. అందుకే మంత్రి పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి వంటి ప్రముఖులెవరూ.. ఇప్పటివరకూ పవన్‌ను తిట్టకపోవడానికి, అదే ప్రధాన కారణమంటున్నారు.

Latest Articles

నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12

స్వతంత్ర వెబ్ డెస్క్: సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 వాహకనౌక నింగిలోకి దూసుకుపోయింది. నిన్న ఉదయం ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ ప్రక్రియ.. 27 గంటల 30 నిమిషాల పాటు కొనసాగిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
250FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్