- అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్లో ఘటన
- మోదీ సర్కార్పై ప్రతిపక్షాలు ఆగ్రహం
- వివరణ ఇచ్చిన రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్
భారత – చైనా సరిహద్దుల్లో అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో సరిహద్దురేఖ వెంబడి ఉన్న ప్రాంతాల్లో భారత – చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఇక్కడ సరిహద్దు భద్రతాదళం కాపలాసైనికుల మధ్య డిసెంబర్ 9న ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఇరు పక్షాలకు చెందిన పలువురు గాయపడ్డారు. చైనా దళాలు మన భూభాగంలోకి చొచ్చుకువచ్చాయని భారతదళాలు ఆరోపించాయి. అనంతరం ఆ ప్రాంతం నుంచి రెండు పక్షాల సైనికులు వెనక్కి తగ్గారు. తర్వాత ఆ ప్రాంత కమాండర్ల మధ్య ఫ్లాగ్ మీటింగ్ జరిగింది. సమస్యను చర్చించి, శాంతి పునరుద్ధరణకు నిర్ణయం తీసుకున్నారు.
సరిహద్దు ఘర్షణ విషయం వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పార్లమెంటులో మోదీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో హైలెవెల్ మీటింగ్ జరిగింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవెల్, త్రివిధదళాల అధిపతులు రక్షణశాఖ మంత్రి ఇంట్లో సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితిపై తాజాగా చర్చించారు.
పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాగానే, ప్రతిపక్షాల ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దుచేసి, తక్షణం సరిహద్దుల్లో పరిణామాలపై చర్చించాలని పట్టుబట్టాయి. లోక్ సభలో స్పీకర్ కానీ, రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ జగదీప్ ధన్కడ్ కానీ, ప్రతిపక్షాల డిమాండ్ ను ఆమోదించలేదు. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఓ ప్రకటన చేస్తారని పేర్కొన్నారు.
సరిహద్దుల్లో ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లోక్ సభలో ప్రకటన చేశారు. చైనా దురాక్రమణ ప్రయత్నాలను భారత సైనికులు తిప్పికొట్టారని ప్రకటించారు. ఘర్షణలో మన సైనికులకు గాయాలు కాలేదని తెలిపారు. భారతీయ సైనికుల్లో సాహసం నిబద్ధతకు సభ్యులంతా మద్దతు తెలపాలని కోరారు.
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన తర్వాత ప్రతిపక్షాలు సరిహద్దు సమస్యపై చర్చించేందుకు పట్టుపట్టాయి. కానీ స్పీకర్ ఏకపక్షంగా.. రక్షణమంత్రి ప్రకటనపై చర్చించే ప్రసక్తే లేదని స్పష్టం చేయడంతో ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. జీరో అవర్ లోనే సరిహద్దు సమస్యపై చర్చకు పలువురు సభ్యులు నోటీసు ఇచ్చినా .. స్పీకర్ పట్టించుకోకపోవడంతో విపక్షాలు వాకౌట్ చేశాయి.
కాంగ్రెస్ ప్రెసిడెంట్, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ఘర్షణ విషయంలో వివరణ కోరేందుకు తమకు అవకాశం ఇస్తామని రాజ్యసభ చైర్మన్ తెలిపారని, తర్వాత తమ మాటనే పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.