39.2 C
Hyderabad
Friday, March 29, 2024
spot_img

తెలంగాణ కాంగ్రెస్‌లో ‘కుల’ కలం

  • టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షుల్లో రెడ్లకే పెద్దపీట
  • భగ్గుమన్న కాంగ్రెస్‌ బడుగు నేతలు
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మొండి చేయి
  • రేవంత్‌ చుట్టూ తిరిగిన వాళ్లకే ప్రాధాన్యమా?
  • తన వారి కోసం ప్రత్యేక జిల్లాల ఏర్పాటు చేశారన్న విమర్శలు
  • కాంగ్రెస్‌కు బడుగుల ఓట్లు అవసరం లేదా?
  • పార్టీలో సామాజిక న్యాయం ఇలాగేనా?
  • నాలుగుశాతం రెడ్ల ఓట్లతోనే గెలుస్తారా?
  • ఖర్గేకు ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి వెళ్లిన ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ నేత లు
  • రాములు నాయక్‌ ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్లిన బడుగు నేతలు
  • పార్టీని రెడ్లమయం చేస్తున్నారంటూ నేతల ఆగ్రహం
  • బడుగుముద్ర చెరిగిపోతోందంటూ నేతల ఆందోళన
  • రాజీనామాకు గిరిజన నేత బెల్లయ్య నాయక్‌ రెడీ
  • ఇప్పటికే పార్టీ కమిటీ పదవికి బీసీ నేత కొండా సురేఖ రాజీనామా
  • వారి దారిలోనే మరికొందరు అగ్రనేతలు

( మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘ రెడ్లు మాత్రమే రాజకీయ పార్టీల రక్షకుల’’ని గతంలో స్పష్టం చేసిన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.. చివరకు అన్నంతపని చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ కొత్త కార్యవర్గానికి‘ రెడ్డి’ కార్పెట్‌ వేయించారు. కీలకమైన ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుల పదవులతోపాటు, జిల్లా అధ్యక్షుల నియామకంలోనూ సింహభాగం రెడ్లకే ధారాదత్తం చేసి, రెడ్ల పెదవులపై చిరునవ్వులు పూయించారు. అయితే అదే ఇప్పుడు పార్టీ కొంపముంచబోతోంది.

పార్టీ కమిటీల్లో తమకు మొండిచేయి దక్కడంపై, బడుగు-బలహీన వర్గాలు భగ్గుమన్నాయి. సీనియర్లమయిన తమను అవమానించిన వైనాన్ని, వారు సహించలేకపోతున్నారు. జనాభాలో కేవలం 4 శాతం కూడా లేని రెడ్ల ఓట్లతో, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందా అని ఆగ్రహిస్తున్నాయి. బడుగు బలహీన వర్గాల ఓట్లు పార్టీకి అవసరం లేదా అని నిలదీస్తున్నాయి. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ ఆధ్వర్యంలో.. వారంతా తమకు జరిగిన అన్యాయాన్ని, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేసేందుకు, హస్తినకు పయమనవడం పార్టీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్‌లో ‘కుల’కలం రేగింది. పీసీసీ కమిటీలపై ‘ రెడ్డి ముద్ర’ వేయడంపె, ై మిగిలిన కులాలు కళ్లెర్ర చేస్తున్నాయి. బడుగు బలహీన వర్గాల పార్టీ అన్న ముద్ర చెరిపివేసేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ.. ఆయనపై పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేకు ఫిర్యాదు చేసేందుకు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ ఆధ్వర్యంలో ఎస్సీ, ఈస్టీ, బీసీ, మైనారిటీ నేతలు, సోమవారం ఢిల్లీకి వెళ్లడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

పార్టీ అధిష్ఠానం ప్రకటించిన 84 మంది ప్రధాన కార్యదర్శులలో 22 మంది, అలాగే 24 మంది ఉపాధ్యక్షుల్లో 7 గురు రెడ్లు, 17 మంది పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీలో 6 గురు రెడ్లు, ఇప్పటివరకూ ప్రకటించిన 26 డీసీసీ కమిటీల్లో 10 మంది రెడ్లు ఉండటం, బడుగు నేతల ఆగ్రహానికి గురయింది. వీరిలో కూడా పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి చుట్టూ తిరిగేవారే ఎక్కువన్నారన్నది వీరి ప్రధాన ఆరోపణ.

కమిటీ ఎంపికలో రేవంత్‌రెడ్డి అధిష్ఠానాన్ని తప్పుదోవపట్టించారని బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే కమిటీని ప్రకటించామని చెబుతున్నా, రేవంత్‌రెడ్డి ఆయన విశ్వాసంలో తీసుకున్న కొందరి అభిప్రాయాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారంటున్నారు. నిత్యం హైదరాబాద్‌లో ఉంటూ, రేవంత్‌ చుట్టూ తిరిగే రాజ్‌ఠాకూర్‌ వంటి నేతలకు పెద్దపల్లి, రోహిన్‌రెడ్డికి డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది.

ఖైరతాబాద్‌ జిల్లా లేకపోయినా, కేవలం రోహిన్‌రెడ్డి కోసమే జిల్లా ఏర్పాటుచే శారని, మళ్లీ అదే ఖైరతాబాద్‌ నుంచి విజయారెడ్డికి ప్రధాన కార్యదర్శి పదవి ఎలా ఇస్తారంటున్నారు. మరి పీజేఆర్‌ కుమారుడైన విష్ణువర్దన్‌రెడ్డిని ఎలా విస్మరించారని ప్రశ్నిస్తున్నారు.40 మంది ఈసీ మెంబర్లలో 13 మంది రెడ్లు ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

రేవంత్‌ వెంట వచ్చిన మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌కు కీలమైన ఉపాధ్యక్ష పదవి ఇచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈవిధంగా రేవంత్‌రెడ్డి తన సన్నిహితులు, సొంత కులానికి చెందిన నాయకులకు పదవుల్లో పెద్ద పీట వేశారని బడుగు నేతలు మండిపడుతున్నారు. ఇక తమకు ప్రాధాన్యం తగ్గించడంపై అటు మహిళా నేతలు కూడా మండిపడుతున్నారు.

ఐఏసిసి సెక్రటరిగా ఉన్న వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్‌, శ్రీధర్‌బాబును పీఏసీ కమిటీలో స్థానం కల్పించిన నాయకత్వం.. అదే ఏఐసీసీ సెక్రటరీగా ఉన్న బెల్లయ్యనాయక్‌ను మాత్రం విస్మరించడంపై, అసంతృప్తి వ్యక్తమవుతోంది.

84 మంది ప్రధాన కార్యదర్శుల్లో మహిళలకు కేవలం ఐదుగురికే స్థానం దక్కగా, 24 మంది ఉపాధ్యక్షుల్లో ముగ్గురికే స్థానం కల్పించారు. అందులో ఒకరు రెడ్డివర్గానికి చెందిన మహిళ ఉండటం గమనార్హం. 26 మంది జిల్లా అధ్యక్షులు ప్రకటించగా అందులో కేవలం ఒక్కరికే, అది కూడా వెలమ వర్గానికి అవకాశం ఇచ్చారు. 18 మంది ఉన్న పీఏసీలో కేవలం ఇద్దరు మహిళలకే అవకాశం దక్కడంపై మహిళలు కూడా ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు.

తాజా కమిటీ కూర్పుపై ఆగ్రహం వ్యక్తం చేసిన గిరిజన నేత బెల్లయ్య నాయక్‌ అనేక ప్రశ్నలు సంధించారు. పార్టీలో ఒకరికి ఒకే పదవి సిద్ధాంతాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆ ప్రకారంగా తనకు ఉన్న పీసీసీ సీనియర్‌ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తానని, అదే విధానాన్ని అందరూ పాటించాలని డిమాండ్‌ చేశారు. తాను ఏఐసీసీ సెక్రటరీ హోదాలో తాను పిఏసీలో ఉంటానని, కానీ దానిని కూడా కమిటీలో విస్మరించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిటీ కూర్పుపై తాను ఖర్గేకు ఫిర్యాదు చేశానని చెప్పారు. అటు వరంగల్‌ జిల్లా ఫైర్‌బ్రాండ్‌, బీసీ వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ కూడా పార్టీలో కొత్తగా తనకు ఇచ్చిన పదవికి రాజీనామా చేశారు. తాను సామాన్య కార్యకర్తగానే పనిచేస్తానని ఆమె స్పష్టం చేశారు.

మొత్తంగా రేవంత్‌రెడ్డి- మాణిక్యం ఠాగూర్‌ కలసి అధిష్ఠానాన్ని తప్పుదోవపట్టించి, కమిటీని తమ సొంత మనుషులతో నింపేసుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి తాజా కమిటీపై ఫిర్యాదు అందుకునే అధిష్ఠానం మరి ఏవిధంగా నష్టనివారణకు దిగుతుందో చూడాలి.

Latest Articles

ఇక్కడ ఉద్యోగాలు అమ్మబడును ?

    మున్సిపాలిటీ ఉద్యోగుల నియామకాల్లో రూల్స్‌ బ్రేక్‌.. ఎన్నికల కోడ్‌తో హడావుడిగా భర్తీలు... కౌన్సిల్‌ తీర్మానం లేకుండానే అంతా కానిచ్చిన అధికారులు. ఉద్యోగాలు అమ్ముకున్నారంటూ ఆరోపణలు. ఇంతకీ ఉద్యోగాల అమ్మకాలేంటి..? ఎవరా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్