‘వాయుసేన’ యుద్ధ విన్యాసాలు
ఇటీవల భారత్ చైనా మధ్య ఘర్షణల నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకిలా చైనా పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది? అగ్రరాజ్యం అనిపించుకోవాలనే కాంక్షతోనే ఇవన్నీ చేస్తోందా? అందుకు భారత్ మద్దతివ్వడం లేదనే అక్కసుతో చేస్తోందా? లేదంటే భారత్ వెనుక ఉన్నవారిని భయపెట్టాలనా? అనే విషయాలపై రకరకాల చర్చలు వాదోపవాదాలు వినిపిస్తున్నాయి.
తాజాగా తెలిసిన విషయం ఏమిటంటే ముందుగా నిర్ణయించుకున్నట్టుగా తూర్పు సెక్టార్ లో భారత్ వాయిసేన రెండురోజుల పాటు యుద్ధ విన్యాసాలు చేయనుంది. దీనిలో ఫైటర్ జట్లు, రవాణా విమానాలు, మానవ రహిత విమానాలు, హెలికాఫ్టర్లు పాల్గొననున్నాయి. వాస్తవాధీన రేఖ వెంట వాయుసేన పనితీరును గమనించేందుకు తూర్పు కమాండ్ వీటిని నిర్వహిస్తోంది. అయితే ఇటీవల జరిగిన ఘర్షణతో యుద్ధ విన్యాసాలకు సంబంధం లేదని వాయుసేన చెబుతోంది.
భారత్-చైనా సరిహద్దుకు 155కిమీ దూరంలో ఉత్తరాన ఉన్న షిగాట్సే ఎయిర్ పోర్టులో చైనా కదలికలు పెరిగాయి. ఇక్కడ ఫైటర్ జెట్లు, ఎయిర్ బార్న్ ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, మానవ రహిత విమానాలను నిలిపి ఉంచింది. అలాగే కీలకమైన పాంగాంగ్ సరస్సు వద్ద బీజింగ్ భారీగా నిర్మాణాలు చేపట్టడం చూస్తుంటే భారత్ కూడా తగిన విధంగా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ చైనా ఏం చేసిందంటే ఇక్కడ అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను, పేలుళ్లను తట్టుకునేలా బంకర్లను ఏర్పాటు చేసుకుంది.
ఏది ఏమైనా పార్లమెంటులో కూడా బీజేపీని ఇరుకున పెట్టేందుకు ఈ సరిహద్దు ఘర్షణలని హైలైట్ చేయాలని కాంగ్రెస్ చూస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రకంగా రాజకీయంగా తాము లబ్ధి పొందాలని చూస్తోందని, చైనా ఇంతదూరం రావడానికి బీజేపీ విధానాలే కారణమని కూడా ఆరోపిస్తోంది. ఇటు రాజకీయంగా వార్, అటు రియల్ వార్ మధ్య బీజేపీ సతమతమవుతోంది.