- ధర్మం కోసం యుద్ధం చేస్తామన్న బీజేపీ చీఫ్
- నన్ను ఎన్నో అవమానాలకు గురి చేశారని ఆవేదన
- బీఆర్ఎస్ ఏర్పాటుతో తెలంగాణకు పీడా విరగడైందని సెటైర్
కరీంనగర్: కరీంనగర్ గడ్డ బీజేపీ అడ్డా అని..కార్యకర్తల కష్టం వల్లే తాను ఎంపీగా గెలిచానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ గడ్డ తనకెంతో ఇచ్చిందన్నారు. హిందూ ధర్మ రక్షణ కోసం నిరంతరం పనిచేస్తానని తెలిపారు. కరీంనగర్ లో జరిగిన ప్రజాసంగ్రామయాత్ర ముగింపుసభలో ఆయన భావోద్వేగంతో మాట్లాడారు.
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోతే కార్యకర్తలు ఏడ్చారని.. దానిపై దేశం అంతా చర్చ జరిగిందన్నారు. అవమానాలకు తాను భయపడనని చెప్పారు. గులాబీజెండాతో అపవిత్రమైన తెలంగాణను కాషాయజెండాతో పవిత్రం చేయమని, తనకు జాతీయ నాయకత్వం సూచించిందని తెలిపారు. అందుకే ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టినట్లు బండి సంజయ్ పేర్కొన్నారు.