- రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భగ్గుమన్నఅయ్యప్పలు
నాస్తిక సంఘం మహా సభలు నిర్వహించిన సమయంలో నాస్తిక సంఘం నాయకుడుగా చెప్పుకొంటున్న భైరి నరేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అన్నా చెల్లెల్లకు పుట్టినవాడే అయ్యప్ప అనీ, ఆ సమయంలో సినిమా పాటలు పాడుకొన్నారంటూ వివాదాస్పదంగా ప్రసంగం చేశారు. అందుకు తగినట్లుగా ఆయన డ్యాన్స్ లు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.
దీంతో హైందవ సంఘాలు, అయ్యప్ప భక్త సమాజం వంటి సంస్థలు భగ్గుమన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. నరేష్ ను వెదకి పట్టుకొని అరెస్టు చేశారు. నరేష్ కనబడితే చాలు ఉతికేయాలన్న కోపంతో అయ్యప్ప సంఘాలు వెంటాడాయి. దీంతో నరేష్ ను అదుపులోకి తీసుకొని పోలీసులు జైలుకి తరలించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లక్షల సంఖ్యలో భక్తుల అయ్యప్ప దీక్షలు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తుంటారు. ఒక రకంగా చెప్పాలంటే శబరిమలై యాత్ర చేసే భక్తుల్లో తెలుగు యాత్రికుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటి అయ్యప్పను నానా మాటలు అనటం తో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున అలజడి చోటు చేసుకొంది. చివరకు నరేష్ అరెస్టుతో పరిస్థితి సద్దుమణిగింది.