ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశాన్ని వదిలేసి జనసేన మీదనే ఎక్కువగా వైసీపీ నేతలు విరుచుకు పడుతున్నారు. దీని ద్వారా అటెన్షన్ ను అటు వైపు మళ్లిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిని పరిశీలిస్తే.. తెలంగాణ రాజకీయాల ఛాయలు ఇక్కడ కనిపిస్తున్నాయి.
తెలంగాణ లో కొంత కాలంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను పరిశీలిద్దాం. టీ ఆర్ ఎస్ నాయకులు పదే పదే నరేంద్రమోదీని, బండి సంజయ్ ను టార్గెట్ చేశారు. దీనిని ఎదుర్కొనేందుకు బీజేపీ నేతలు టీ ఆర్ ఎస్ పార్టీ మీద విరుచుకు పడ్డారు. దాదాపుగా ప్రతీ రోజూ ఇదే లొల్లి. ఈ హడావుడిలో ప్రజలంతా కాంగ్రెస్ ను మరిచిపోయారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ అవతరించింది, ఒక్క సీటు తప్ప బీజేపీ తుడిచి పెట్టుకొని పోయింది. కానీ టీ ఆర్ ఎస్, బీజేపీ చేస్తున్న మాయాజాలంతో ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఖాళీ అయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి గడచిన రెండు, మూడు ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కటం లేదు. ఇదంతా రాజకీయ మాయ మాత్రమే.
కొంత కాలం నుంచి జన సేన పార్టీని, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకొని వైయస్ఆర్ సీపీ నాయకులు విపరీతంగా విమర్శలు చేస్తున్నారు. పవన్ ఒక్క మాట అంటే, వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు పది మాటలు తిరిగి అంటున్నారు. దీంతో జన సేన నాయకులు తిరిగి మాట్లాడినా పెద్దగా జనంలోకి వెళ్లటం లేదు. దీనిని గమనించి తెలుగుదేశం నాయకులు కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలుస్తూ… వైసీపీ మీద దాడి చే్స్తున్నారు. తిరిగి పవన్ మీద మాటల దాడి కొనసాగుతోంది. ఇది నెమ్మది నెమ్మదిగా వైసీపీ వెర్సస్ జనసేన గా ముదిరిపోతోంది. వాస్తవానికి వైయస్ జగన్ కోరుకొనేది కూడా ఇదే.
తెలంగాణ లో కాంగ్రెస్ ను జరిపేసినట్లుగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశాన్ని కదిలించాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఏపీ అంతటా బలమైన మూలాలు ఉన్న టీడీపీ ని కదిలించటం చాలా కష్టం. ఇది గమనించే తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మరింత జోరుగా మీడియాలోనూ, ప్రజల్లోనూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీంతో ఏపీ రాజకీయాలు మూడు ముక్కలాట మాదిరిగా మారుతున్నాయి.