వారందరూ ఆ ఇంటిలో హాయిగా నిద్రపోయారు. ఎప్పటిలాగే సూర్యోదయాన్ని చూస్తారని అనుకున్నారు. కానీ విధి వైపరీత్యం మంటల రూపంలో మృత్యుదేవత ఆ ఇంటిని చుట్టుముట్టింది. నిద్రపోతున్న ఆరుగురు సజీవదహనమైన హృదయవిదారక సంఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్ లో జరిగింది.
ఇంటి యజమాని శివయ్య (50) ఆయన భార్య రాజ్యలక్ష్మి (45), రాజ్యలక్ష్మి అక్క కుమార్తె మౌనిక (23), ఆమె ఇద్దరు కుమార్తెలు హిమబిందు( 4), స్వీటీ (2) సింగరేణిలో పనిచేస్తున్న సమీప బంధువు శాంతయ్య మొత్తం ఆరుగురు సజీవ దహనమయ్యారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అర్థరాత్రి ఆ ఇంటిలోకి మంటలు ఎలా ప్రవేశించాయి. గ్యాస్ బండను కట్టివేయకుండా వదిలేసి ఉండటం వల్ల ఏమైనా జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అలాంటిదేమీ లేదని పోలీసులు చెబుతున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల కూడా జరగలేదని విద్యుత్ శాఖాధికారులు చెబుతున్నారు. మరెలా జరిగిందని పోలీసులు అన్నికోణాల్లో విచారణ చేపడుతున్నారు. మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్, ఏసీపీ తిరుపతిరెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లారు.