Site icon Swatantra Tv

రేపు భాగ్యనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం మూడు వారాలపాటు ఘనంగా నిర్వహిస్తున్నది. తొలిరోజైన శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్‌ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు, వాహనాలను దారి మళ్లించనున్నారు. ఎన్టీఆర్‌ గార్డెన్‌, ఎన్టీఆర్‌ ఘాట్‌, నెక్లెస్‌ రోడ్డు, లుంబినీ పార్కును మూసేస్తారు. ఈ సందర్భంగా సచివాలయం, గన్‌పార్కు పరిసరాల్లో, ప్రధాన జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌ రద్దీ ఉండే అవకాశాలున్నాయి. దీంతో ఆ మార్గాల్లో నిర్ణీత కాలంలో రాకపోకలు సాగించకుండా వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని అధికారులు సూచించారు.

అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద కూడా వేడుకలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆ రూట్‌లో రాకపోకలు సాగించే వాహనాలను కొద్దిసేపు నిలిపివేయనున్నారు. పంజాగుట్ట నుంచి రాజ్‌భవన్‌ వైపు, సోమాజిగూడ నుంచి వీవీ విగ్రహం వైపు, రవీంద్ర భారతి నుంచి ఇక్బాల్‌ మినార్‌, ఇక్బాల్‌ మినార్‌ నుంచి ఓల్డ్‌ సైఫాబాద్‌ పీఎస్‌, ఓల్డ్‌ సైఫాబాద్‌ పీఎస్‌ నుంచి రవీంద్రభారతి, ఓల్డ్‌ సైఫాబాద్‌ పీఎస్‌ నుంచి ఇక్బాల్‌ మినార్‌ వైపు, బీజేఆర్‌ విగ్రహం, నాంపల్లి వైపు నుంచి రవీంద్రభారతి, పీసీఆర్‌ జంక్షన్‌, బషీర్‌బాగ్‌ జంక్షన్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను కొద్ది సేపు నిలిపివేస్తారు. వాహనదారులు ఈ రూట్లలో తమ ప్రయాణాలను లేకుండా ప్రత్యామ్నాయం మార్గాలు చూసుకోవాలని తెలిపారు.

Exit mobile version