మానవ జీవితంలో సమస్యలు సహజమని ప్రముఖ సినీ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. లక్ష్యసాధనలో సమస్యల్ని దాటుకుని విజయతీరాలకు చేరాలని ఆయన అభిలాషించారు. ఈ కాలం యువత అనేక రంగాల్లో రాణిస్తున్న తీరు ముచ్చట కలిగిస్తోందని త్రివిక్రమ్ తెలిపారు. శాస్త్రీయ సంగీత సాహిత్య రంగాల్లో భారత యువత రాణించాలని ఆయన సూచించారు.
త్రివిక్రమ్ భార్య, ప్రముఖ నాట్య గురువు సౌజన్య శ్రీనివాస్ పర్యవేక్షణలో ‘దొరకునా ఇటువంటి సేవ’ పేరుతో నాట్యకదంబం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సౌజన్య శ్రీనివాస్ దగ్గర అనేక సంవత్సరాలు పాటు నృత్య శిక్షణ పొందిన శిష్టా వైష్ణవి చేసిన నృత్యం అందరిని ఆకట్టుకుంది. శిష్టా కృష్ణ కుమార్, మైత్రేయి దంపతుల కుమార్తె అయిన వైష్ణవి లా స్టూడెంట్ గా చదువుకుంటూ నాట్యంలో చక్కటి ప్రావీణ్యం సంపాదించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత ప్రముఖ నాట్య గురువు పసుమర్తి రామలింగ శాస్త్రి, తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ, ఎన్ఐజీఎల్ ఆస్పత్రి డైరెక్టర్ డా.ఆర్వి రాఘవేంద్రరావు పాల్గొన్నారు.