హైదరాబాద్(Hyderabad)లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నిన్నటి వరకు ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయిన నగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది. గురువారం ఉదయం నుంచే మబ్బులు కమ్ముకోవడంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. మధ్యాహ్నం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్ సమీపంలోని వికారాబాద్(Vikarabad ), సంగారెడ్డి(Sangareddy) జిల్లాల వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రెండు జిల్లాల్లో పలు చోట్ల వడగండ్ల వర్షం కురిసింది. మరోవైపు వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా వచ్చే ఐదు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.