స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: సూటు, బూటు వేసుకొని బయటి దేశస్తుల చెవుల్లో పూలుపెట్టిన చిన్నదొర.. తెలంగాణ ప్రజలను, రైతులను మాత్రం పిచ్చోళ్లను చేయలేవు అంటూ కేటీఆర్ పై విరుచుకుపడ్డారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. దేశాలు దాటి పచ్చి అబద్ధాలు వల్లించినా అవి నిజాలు అవ్వవు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు తలమానికం కాదు.. తెలంగాణ కు గుదిబండ అంటూ నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజలకు జీవధార కాదు.. నీ కుటుంబానికి కమీషన్ల ధార… తెలంగాణ ఖజానాకు కన్నీటి ధార అంటూ తనదైన శైలిలో మండిపడ్డారు. కాళేశ్వరం అంటే తండ్రీకొడుకులు ఎప్పుడు కమీషన్లు కావాలన్నా వాడుకునే ఏటీఎం అని వ్యాఖ్యానించారు.
ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఒక అద్భుతం కాదు “మెగా” వైఫల్యం.. మీలాంటి పనిమంతులు పందిరి వేస్తే కుక్క తోక తగిలి కూలినట్లు గాలివానకే కూలిన “మెగా” కట్టడం.అంటూ మండిపడ్డారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఎన్ని ఎకరాలకు సాగునీరు ఇచ్చారో మీకే తెలియని అయోమయ పరిస్థితి. చిన్న దొర 90 లక్షలు అంటాడు. పెద్ద దొర 45 లక్షల ఎకరాలు అంటాడు. హరీశ్ రావు అసెంబ్లీ వేదికగా 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం అంటాడు.. సర్కారు వెబ్ సైట్ లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చాం అని చెప్తారు. కమీషన్ల కాళేశ్వరంపై ఎవరి మాట నిజం..? ఎవరి మాట అబద్ధం..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
చిన్నదొర చెప్పినట్లు 97 లక్షల ఎకరాలకు కాళేశ్వరమే సాగునీరు అందిస్తే.. రాష్ట్రంలో మిగతా సాగునీటి ప్రాజెక్టులు బంద్ పెట్టినట్లా..? ఎస్సారెస్పీ, దేవాదుల, ఎల్లంపల్లి లాంటి ప్రాజెక్టులు చుక్క నీరు ఇవ్వనట్లా..? మసిపూసి మారేడు కాయ చేసినట్లు పాత ఆయకట్టును కొత్త ఆయకట్టుగా చూపే కనికట్టు. లక్ష కోట్ల కాళేశ్వరం లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చిందో లేదో కానీ దొరలు మాత్రం పచ్చి బూటకపు మాటలు చెప్తున్నారు… దేశాలు దాటి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు.
కమీషన్ల కాళేశ్వరంతో తెలంగాణ దేశానికి ధాన్యాగారం అయితే.. తొమ్మిదేండ్లలో 9 వేల రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నట్లు..? రోజుకు ఇద్దరు, ముగ్గురు రైతులు ఎందుకు ఉరి వేసుకుంటున్నట్లు? వరి వేస్తే ఉరి అని సన్నాసి మాటలు ఎందుకు చెప్పినట్లు? చిన్న దొర సమాధానం చెప్పాలి. వైట్ ఎలిఫెంట్ లా మారిన కాళేశ్వరంపై వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలి అంటూ డిమాండ్ చేశారు.