స్వతంత్ర, వెబ్ డెస్క్: మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా ఈ నెల 15 ఖమ్మం కు అమిత్ షా రానున్నారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలిపారు. ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. బీజేపీ కార్యాలయం నుండి ఆయన మాట్లాడుతూ.. గతంలో సాయి గణేష్ కుటుంబాన్ని ఫోన్ లో పరామర్శించి.. కింద స్థాయి కార్యకర్తలకు సైతం పార్టీ అండంగా ఉంటుందని అమిత్ షా భరోసా కల్పించారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 8 తర్వాత 9 మిస్ చేసి దశాబ్ది వేడుకలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతులను అనేక రకాల ఇబ్బందులకు గురి చేసి.. రుణ మాఫీ చేయలేదు కానీ.. సెలబ్రేషన్స్ చేసుకునే అర్హత మీకుందా? అంటూ ప్రశ్నించారు.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ వేడుకలు చేపడుతున్నారని.. 155 వేల 210 కోట్ల 86 లక్షలు ఇరిగేషన్ కు ఖర్చు చేశారని మండిపడ్డారు. దీంతో ఎన్ని ఎకరాలకు నీళ్ళు అందించరనేది వారికే క్లారిటీ లేదు. అటు ఇరిగేషన్ లెక్కలు అన్ని తప్పుడుగా ఉన్నాయి. అసలు దీని వెనకున్న మతలబు ఏంటి? అంటూ ప్రశ్నించారు. మీరు ఎన్ని ఎకరాలకు కొత్తగా నీళ్లు అందించారు? అనేది శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో 84% బోర్ల ద్వారా నీటి పారుదల కొనసాగుతోందని అన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 18లక్షల బోర్లు ఉంటే… ఇప్పుడు వాటి సంఖ్య 26 లక్షలకు చేరిందని అనాన్రు. మీరు ప్రాజెక్ట్ ల ద్వారా నీళ్లు ఇస్తే .. బోర్ల సంఖ్య ఎందుకు పెరిగింది? అన్ని ప్రశ్నించారు.
“కాళేశ్వరం గొప్పగా కట్టమని గప్పలు కొట్టారు. మరీ అక్కడ ఎందుకు ఈ దశాబ్ది ఉత్సవాల సెలబ్రేషన్స్ చేయట్లేదు? కాళేశ్వరం నీళ్ళు ఎక్కడ పారుతున్నయో చెప్పాలి. అక్కరకు వచ్చే ప్రాణహితను పక్కన పెట్టి .. కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టారు. పక్క రాష్ట్రం వారు సంగమేశ్వర ప్రాజెక్ట్ తో నీళ్ళ దోపిడీ జరిపితే చీమ కుట్టినట్లు కూడా కేసిఆర్ స్పందించలేదు. తుమ్మిడిహాట్టి ప్రాజెక్ట్ ఎక్కడికి పోయింది. కేసిఆర్ చేతగాని తనం వల్లే మనకు న్యాయంగా రావాల్సిన వాటా రాకుండా పోయింది.కృష్ణ నది నుంచి రాయలసీమకు నీళ్ళు తరలి పోతుంటే కేసిఆర్ నోరు విప్పలేదు ఎందుకు? ఇరిగేషన్ లో భారీ అవినీతి జరిగింది. దమ్ముంటే ప్రాజెక్ట్ లపై చేసిన ఖర్చు పై బహిరంగ చర్చకు సిద్ధమా?ప్రజలను భ్రమలో పెట్టే కార్యక్రమమే ఈ నీళ్ళ పండుగ.బీజేపి ని బూచిగా కాంగ్రెస్, బీ అర్ ఎస్ అడే నాటకాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు ” – ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి