స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: టీఆర్ఎస్ నుంచి జాతీయపార్టీగా బీఆర్ఎస్ మారిన తర్వాత ఆ పార్టీ ఇతర రాష్ట్రాల్లో ప్రత్యేక దృష్టి పెట్టింది. తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ముఖ్యంగా మహారాష్ట్ర మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆ రాష్ట్రానికి చెందిన నాయకులను పార్టీలో చేర్చుకోవడంతో పాటు భారీ బహిరంగసభలు కూడా నిర్వహించారు. అంతేకాకుండా పార్టీ శ్రేణులకు శిక్షణా శిబిరం కూడా ఏర్పాటుచేశారు. అధినేత కృషితో ఆ పార్టీకి అక్కడ సానుకూల వాతావరణం ఏర్పడింది.
ఇటీవల ఔరంగాబాద్ జిల్లాలోని గంగాపూర్ తాలూకా అంబేలోహల్ గ్రామ పంచాయతీ ఒకటో వార్డుకు ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి గఫూర్ సర్దార్ పఠాన్ 115 ఓట్లతో గెలిచారు. దీంతో తెలంగాణ అవతల తొలి విజయాన్ని బీఆర్ఎస్ దక్కించుకుంది. ఈ విజయంపై బీఆర్ఎస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో తమ పార్టీ బలమైన ముద్ర వేయబోతోందనే దానికి ఈ విజయం నాంది పలకనుందని ఆశాభావంతో ఉన్నారు.