స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం కేసీఆర్, కాంగ్రెస్ పార్టీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంపాపేటలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించారు. అందులో పాల్గొన్న సంజయ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను కేసీఆర్ నిర్ణయిస్తున్నారని.. కర్ణాటకలో కాంగ్రెస్కు కేసీఆర్ డబ్బులు పంపించారని ఆరోపించారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలను మోసం చేసిన విశ్వాస ఘాతకుడు కేసీఆర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెంచేందుకు కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణకు సంబంధం లేదని తేల్చిచెప్పారు. తెలంగాణ బీజేపీపై ప్లాన్ ప్రకారం కుట్రలు చేస్తున్నారని తెలిపారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్ బీఆర్ఎస్కు ఎలా ప్రత్యామ్నాయం అవుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయిందని విమర్శలు చేశారు. అందుకే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తాయని ఆయన జోస్యం చెప్పారు.