అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ సామాజిక రచయితల సంఘం మరియు జోర్దార్ దినపత్రికలు సంయుక్తంగా హనుమకొండలోని శ్రీ రామకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో తెలంగాణ రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు నోముల శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రముఖ వ్యంగ్య రచయిత హాస్యబ్రహ్మ శంకర్ నారాయణ మాట్లాడుతూ… బమ్మెర పోతన దాశరథి లాంటి కవులకు పుట్టినిల్లు అయినా ఓరుగల్లు పోరాటాల గడ్డ అని నిజాం రాజును ఎదిరించిన దాశరథి ధైర్యం యావత్ ప్రజానీకానికి స్ఫూర్తిగా నిలిచిందని.. సాయుధ పోరాటానికి మార్గదర్శకత్వం వహించిందని పేర్కొన్నారు.
విద్వత్తుకు పుట్టినిల్లు అయిన తెలంగాణ ప్రజలు అదృష్టవంతులని ఇక్కడ ఉర్దూ, తెలుగు రెండు భాషలు రెండు కళ్ళుగా ఉన్నాయని.. ఆంధ్రకు చెందిన తనకు మాత్రం ఉర్దూ మాధుర్యాన్ని చవిచూసే అదృష్టానికి నోచుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో బత్తిని లక్ష్మి ,వేముల మమత, ఎర్ర ప్రసూన, శ్రీమతి ఫాతిమా జహీరా, మాటేటి పురుషోత్తం రావు, కందకట్ల జనార్ధన్, మొగ్గం సుమన్, స్వరూప రాణి తదితర పలువురు కవులు వివిధ సామాజిక అంశాలపై తాము రాసిన కవితలను గానం చేశారు.
వెనిశెట్టి రవికుమార్ రాసిన “నేనెరిగిన శంకర్ నారాయణ ” అనే గ్రంధాన్ని ఈ సభలో ఆవిష్కరించారు. పుస్తక రచయిత హాస్యబ్రహ్మ శంకర్ నారాయణతో తనకు గల అనుబంధాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రముఖ జర్నలిస్టు రచయిత గోపగాని సప్తగిరి గౌడ్ మాట్లాడుతూ.. సాహిత్యం సమాజానికి ఎంతో మేలు చేస్తుందని, కవులు రచయితలు స్తబ్దత వీడి నిరంతరం తమ రచనా సాంగత్యాన్ని కొనసాగిస్తూ సమాజానికి మార్గ నిర్దేశం చేయాలని సూచించారు.
ప్రముఖ హోమియో వైద్యులు సామాజికవేత్త డాక్టర్ పావుశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ.. సాహితీ సంస్థలకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రముఖ జర్నలిస్టు వెంకట్ మాట్లాడుతూ సాహితీ రంగంతో పరిచయం ఉన్న వ్యక్తులు మాత్రమే జర్నలిజంలో రాణిస్తారని, రాయడాన్ని అలవాటుగా మార్చుకుంటే ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి పరిష్కరించవచ్చన్నారు.కార్యక్రమ నిర్వాహకులు జోర్దార్ పత్రిక యజమాని రావుల రాజేశం మాట్లాడుతూ.. తాము తెలంగాణలోని కవులను ప్రోత్సహిస్తామని రాయగల సత్తా ఉన్న ప్రతి ఒక్కరికి తమ పత్రిక ద్వారా అవకాశం కల్పించడం కొరకే పరిమళం అనే పేజీని కేటాయించామని తెలిపారు.
అనంతరం కవులు రచయితలకు శాలువాలు, ప్రశంసా పత్రాలు మరియు షీల్డ్ లు బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సాహితీ విమర్శకులు పల్లేరు వీరస్వామి, పింగళి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బత్తిని చంద్రమౌళి, వేదాంతం శ్రీదేవి మరియు ప్రముఖ జర్నలిస్ట్ దేశబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సామాజిక రచయితల సంఘం వరంగల్ జిల్లా సంయుక్త కార్యదర్శి కొమ్మిడి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించగా జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి వారణాసి అంజనీ శర్మ వందన సమర్పణ చేశారు.