స్వతంత్ర, వెబ్ డెస్క్: ప్రముఖ పారిశ్రామికవేత్త పైడి రాకేష్ రెడ్డి బీజేపీలో చేరారు. ఈ మేరకు తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ ఛుగ్ ఖండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం తరుణ్ మాట్లాడుతూ.. తెలంగాణలో గడిచిన 9 ఏళ్లలో కుటుంబ పాలనా, వంచన పాలనా, అవినీతి పాలనే నడిచిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలనపై విసుగెత్తి ఉన్నారని.. ఇప్పడు ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. అటు కాంగ్రేస్ మీద విరుచుకుపడుతూ.. కేసీఆర్ కోసమే కాంగ్రెస్ పనిచేస్తుందని అన్నారు. కాంగ్రెస్ గుర్తుమీద గెలిచినవాళ్లు కేసీఆర్ పంచన చేరి అసెంబ్లీలో కూర్చుంటున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో కేసీఆర్.. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నాని అన్నారు.
కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని కేసీఆర్ చూస్తున్నాడని.. ఈ క్రమంలో లోపాయికారి ఒప్పందంలో భాగంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ అవినీతిపాలనాను మోడీ నేతృత్వంలో అంతమొందిస్తామన్న తరుణ్.. తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందని అన్నారు. స్వచ్ఛమైన తెలంగాణబిడ్డ పారిశ్రామికవేత్త పైడి రాకేష్ రెడ్డి బీజేపీ లో చేరారని.. రాకేష్ రెడ్డిని బీజేపీలోకి స్వాగతం పలుకుతున్నానని అన్నారు. నవంబర్ లో జరిగే ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మద్దతుతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.