WPL: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ 1 (డబ్ల్యూపీఎల్) అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అట్టహాసంగా మొదలైంది. మగవారికి ఉన్న ఆదరణ…మహిళలకు ఉంటుందా? అని అందరూ వ్యక్తం చేసిన అనుమానాలు పటాపంచలైపోయాయి. ఎందుకంటే మొదటి రోజే పరుగుల వరద పారింది. అంతేకాదు బౌండరీలు, సిక్సర్లతో మహిళా క్రికెటర్లు రెట్టించిన ఉత్సాహంతో…మగవారికన్నా జోష్ తో ఆడి శభాష్ అనిపించుకున్నారు. సీజన్ 1 కావడంతో మహిళా ప్రీమియర్ లీగ్ ను అట్టహాసంగా ప్రారంభించారు. ఇక బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కియారా, కృతి సనన్ తమ అందచందాలతో, మాస్ పాటలకి ఉర్రూతలూగించే స్టెప్పులతో అదరహో అనిపించారు. తమ తళుకు, బెళుకులతో వహ్వా అనిపించారు. మహిళా క్రికెట్ లో నూతనశకం ప్రారంభమైందనే చెప్పాలి. ప్రారంభోత్సవం రోజున 5 జట్ల కెప్టెన్లు స్టేడియంలో డబ్ల్యూ పీఎల్ ట్రోఫీని ఆవిష్కరించారు. అనంతరం తొలిమ్యాచ్ ముంబయి ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగింది. తొలిమ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది.
WPL: కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 30 బంతుల్లో 65 పరుగులు చేసింది. ఇందులో 14 ఫోర్లు ఉండటం విశేషం. ఓపెనర్ హేలి మ్యాథ్యూ 31 బంతుల్లో 47 పరుగులు చేసింది. తన ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, 4 సిక్స్ లు ఉన్నాయి.
208 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన గుజరాత్ జెయింట్స్…ముంబై బౌలర్ల ధాటికి చేతులెత్తేశారు. ఒక దశలో 12 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి విలవిల్లాడింది. చివరికి హేమలత పోరాడి 29 పరుగులు చేసింది. దాంతో 15.1 ఓవర్లలో 64 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ముంబై ఇండియన్స్ 142 పరుగుల భారీ ఆధిక్యంతో గెలిచి విజయోత్సాహంతో డబ్ల్యూపీఎల్ లో ముందడుగు వేసింది.
WPL: టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ బెత్ మూనీ బౌలింగ్ తీసుకోవడం కొంప ముంచిందని అంటున్నారు. ఎందుకంటే మొదట బ్యాటింగ్ చేసినవారికి అనుకూలంగా ఉండదని భావించింది. కానీ సీన్ రివర్స్ అయ్యింది. సెకండ్ బ్యాటింగ్ కి వచ్చేసరికి పిచ్ స్వభావం మారి…టాస్ గెలిచిన టీమ్ కుప్పకూలిపోయిందని విశ్లేషకులు వ్యాక్యానిస్తున్నారు. టెన్నీస్ క్రీడకు ఎలాంటి ఆదరణ ఉందో…మహిళా క్రికెట్ కు అంతే ఆదరణ కల్పించే దిశగా బీసీసీఐ అడుగులు వేస్తోందని విశ్లేషకులు వ్యాక్యానిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..