వివరాల్లోకి వెళితే…దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ లో జరిగిన ఉమన్ టీ 20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ లో 5 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఓటమిపాలైంది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 4 వికెట్లకు 172 పరుగులు చేశారు. తర్వాత 173 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన ఇండియా 167 పరుగుల వరకు వచ్చి ఆగిపోయింది.
చివరి వరకు పోరాడి ఆడిన భారత్…మ్యాచ్ ను విజయతీరాల వైపు చేర్చడంలో విఫలమైంది. ఆఖరి ఓవర్ లో 16 పరుగులు కావాల్సి వస్తే, కేవలం 10 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే పోరాట స్ఫూర్తిని మాత్రం మెచ్చుకోవల్సిందేనని పలువురు కొనియాడుతున్నారు.
T20 World Cup | బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా మొదట్లోనే ఓపెనర్లు షఫాలీ వర్మ (9), స్మ్రతి మంధాన (2) ఆశించినట్టుగా ఆడలేకపోయారు. ఈ క్రమంలో ఫస్ట్ డౌన్ వచ్చిన యస్తికా భాటియా (4) దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యింది. కేవలం 28 పరుగులకే కీలకమైన 3 వికెట్లు కోల్పోయి ఇండియా పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ ప్రభావం తర్వాత బ్యాట్స్ మెన్లపై పడింది. దాంతో వాళ్లు వికెట్లు కాపాడుకుంటూనే రన్ రేట్ పెంచాల్సి వచ్చింది. ఈ క్రమంలో రోడ్రీగస్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ జట్టును ఆదుకున్నారు. ఈ దశలో రోడ్రీగస్ దూకుడు పెంచింది…అలా 24 బంతుల్లో 43 పరుగులు చేసి పెవెలియన్ చేరింది. ఆ తర్వాత హార్మన్ కూడా దూకుడుగానే ఆడింది. తను ఉండగా భారత్ విజయం సాధిస్తుందని అంతా ఆశించారు.
ఇక్కడే దురదృష్టం వెంటాడింది. 15వ ఓవరులో తొలి రెండు బంతులకి రెండు ఫోర్లు బాదింది. తన హాఫ్ సెంచరీ కూడా పూర్తయ్యింది. నాలుగో బాల్ ను స్లిప్ వైపు ఆడింది. అది ఫోర్ అనుకున్నారు. కానీ ఆస్ట్రేలియా ఫీల్డర్ గార్డనర్ దాన్ని అద్భుతంగా ఆపి వికెట్లవైపు వేయడం, సెకన్లలో పదో వంతు తేడాలో హార్మన్ రనౌట్ కావడం జరిగిపోయింది.
మిగిలిన వాళ్లు ప్రయత్నించారు గానీ…విజయానికి 5 పరుగుల దూరంలో ఆగిపోయారు. అయితే ఒకసారి ఇలాగే ధోనీ కూడా 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో డైరక్ట్ త్రోకి రనౌట్ అయిపోయాడు. ఆ తర్వాత మనవాళ్లు 18 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు కూడా హార్మన్ కి ఇలాగే జరిగిందని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఇద్దరి కెప్టెన్ల జెర్సీల నంబర్లు కూడా 7 అని అంటున్నారు. ఓటమిలో కూడా ఇలా అన్ని కలిసిరావడం విచిత్రమేనని కొందరు కామెంట్లు చేస్తున్నారు.