స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచులో ముంబయి ఇండియన్స్ అదరగొట్టింది. ముంబయి బౌలర్ ఆకాశ్ మధ్వాల్ విజృంభించడంతో 81 పరుగుల భారీ తేడాతో లక్నో సూపర్జెయింట్స్ను చిత్తు చేసింది. ఈ విజయంతో రోహిత్ సేన క్వాలిఫయర్-2కి అర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టు గ్రీన్(41), సూర్యకుమార్ యాదవ్(33) మెరవడంతో 20 ఓవర్లలో 182/8 పరుగులు చేసింది. 183 పరుగుల లక్ష్యఛేదనలో బరిలో దిగిన లక్నో ఏ దశలోనూ గెలుపు దిశగా ఆడలేదు.
MI బౌలర్ ఆకాశ్ మధ్వాల్ ధాటికి 16.3 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. మధ్వాల్ కేవలం 5 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. దీంతో 2009లో దిగ్గజ ఆటగాడు అనిల్ కుంబ్లే సరసన చేరాడు. మరోవైపు లక్నో ఆటగాళ్లలో ముగ్గురు రనౌట్ అవ్వడం కూడా ఆ జట్టు అవకాశాలనూ పూర్తిగా దెబ్బతీసింది. ఉత్కంఠభరితంగా సాగుతుందనుకున్న మ్యాచ్ ఇలా ఏకపక్షంగా ముగిసింది. ఈ నెల 26న జరిగే క్వాలిఫయర్-2 పోరులో గుజరాత్ టైటాన్స్ జట్టుతో ముంబయి ఇండియన్స్ తలపడనుంది.