అహ్మదాబాద్: బోర్డర్-గవస్కర్ ట్రోపీలో భాగంగా జరుగుతున్న నాలుగవ టెస్టులో భారత్ అద్భుతమైన పోరాటం కనబరిచింది. తొలి ఇన్నింగ్స్ లో 571 పరుగులు చేసి 91పరుగుల ఆధిక్యం దక్కించుకుంది. భారత ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ(Kohli) బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మూడున్నరేళ్ల తర్వాత సెంచరీ కొట్టిన కోహ్లీ 186 పరుగుల వద్ద ఔటై తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇక అక్షర్ పటేల్ కూడా 79పరుగులతో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లైయన్, మర్ఫీ చెరో 3 వికెట్లు తీశారు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 6 ఓవర్లలో కేవలం 3 పరుగులు మాత్రమే చేసింది. కాగా నడుం నొప్పితో బాధపడుతున్న శ్రేయాస్ అయ్యర్ భారత ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగలేదు. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 480 పరుగులు చేసింది. రేపు ఒకరోజు మాత్రమే మిగిలి ఉండడంతో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మ్యాచ్ లో విజయం నమోదుకాదు.